Begin typing your search above and press return to search.

జగన్ కు మందకృష్ణ తిప్పలు

By:  Tupaki Desk   |   11 May 2016 6:51 AM GMT
జగన్ కు మందకృష్ణ తిప్పలు
X
ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ కు ఇబ్బందులే ఇబ్బందులన్నట్లుగా పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. దీనికి ఆయన అనుసరిస్తున్న విధానాలు కూడా కారణమని చెప్పక తప్పదు. విపక్షంలో ఉన్నప్పుడు వీలైనంత వరకూ అందరిని కలుపుకెళ్లే ధోరణి అవసరం. ఇందుకు కాస్తంత పట్టువిడుపులు అవసరం. ఎస్పీ వర్గీకరణ విషయం ఆచితూచి అడుగులేస్తున్న జగన్.. మాదిగలకు అనుకూలంగా ఇప్పటివరకూ మాట చెప్పింది లేదు. ఈ వైఖరి పట్ల ఎమ్మార్పీఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఆపరేషన్ ఆకర్ష్ తో పార్టీ ఎమ్మెల్యేల్ని ఒకరి తర్వాత ఒకరిగా పార్టీ నుంచి తీసుకెళ్లిపోతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దెబ్బకు కిందామీదా పడుతున్న జగన్ కు.. మందకృష్ణ లాంటి వారి నుంచి నిరసన వ్యక్తం కావటం ఇబ్బందిగా మారింది. ప్రత్యేక హోదా అంశంపై ఏపీ అధికారపక్షం చేతకానితనాన్ని ప్రశ్నించేలా చేయటం కూడా కాకినాడలో నిర్వహిస్తున్న ధర్నాకు జగన్ స్వయంగా హాజరయ్యారు. అయితే.. ఆయన రావటానికి ముందే ధర్నా ప్రాంగణానికి ఎదురుగా పోటీగా వేదికను తయారు చేసుకున్న ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు జగన్ తీరును విమర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేయటంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో.. ఎమ్మార్పీఎస్ కార్యకర్తల్ని బుజ్జగించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కిందామీదా పడాల్సి వచ్చింది.

వారి హామీతో తమ నినాదాల్ని ఆపినప్పటికీ.. జగన్ తన ప్రసంగంలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించని నేపథ్యంలో.. వారు పెద్ద ఎత్తున జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో జగన్ ధర్నా కార్యక్రమంలో అదో మైనస్ పాయింట్ గా మారింది. తాజాగా మందకృష్ణ వ్యూహం చూస్తుంటే.. జగన్ సభల్లో రచ్చ చేయటం ఖాయమన్న విషయం అర్థమవుతుంది. ఎస్సీ వర్గీకరణపై జగన్ పెదవి విప్పనంత కాలం ఆయనకు తిప్పలు తప్పనట్లేనని చెప్పక తప్పదు.