Begin typing your search above and press return to search.

స‌మాధుల వేదిక‌గా బాబుకు నిర‌స‌న‌లు

By:  Tupaki Desk   |   2 March 2016 9:38 AM GMT
స‌మాధుల వేదిక‌గా బాబుకు నిర‌స‌న‌లు
X
కుప్పం...చిత్తూరు జిల్లాలోని ఈ ప్రాంతం గురించి తెలుగు రాష్ర్టాల్లో తెలియ‌ని వారెవ‌రు ఉండ‌రు. తెలుగుదేశం పార్టీ అధినేత‌, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజ‌క‌వ‌ర్గం. ఇపుడు కుప్పం నుంచే బాబును ఇబ్బందుల పాలు చేసేందుకు మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ ఎత్తులు వేస్తున్నారు.

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ చేయాల‌ని డిమాండ్ చేస్తున్న మంద‌కృష్ణ ఈ క్ర‌మంలో ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి ప‌లు ద‌ఫాలుగా విన్న‌వించారు. అయిన‌ప్ప‌టికీ వ‌ర్గీక‌ర‌ణ విష‌యంలో ప్ర‌భుత్వం ముందడుగు వేయ‌లేద‌ని పేర్కొంటూ వర్గీకరణకు అనుకూలంగా మార్చి 9వ తేదీ లోపు అసెంబ్లీలో తీర్మానం చేయాలని డెడ్‌ లైన్ విధించారు. తీర్మానంతో పాటు ఎస్సీ వర్గీకరణపై కేంద్రానికి లేఖ రాసి, అఖిలపక్షం సమావేశం నిర్వహించాలని మంద‌కృష్ణ విన్న‌విస్తూనే...లేనిపక్షంలో మార్చి 10న కుప్పం నియోజకవర్గంలోని నారావారిపల్లె నుంచి విశ్వరూపయాత్ర చేపడతామని, చంద్రబాబు తల్లిదండ్రుల సమాధి నుంచి ఈ యాత్రను ప్రారంభిస్తామన్నారు. రెండు రాష్ర్టాల్లోని 175 నియోజకవర్గాల్లో పర్యటిస్తామని చెప్పారు. ఏప్రిల్‌ 30న విజయవాడలో 10 లక్షల మందితో విశ్వరూప మహాసభ ఏర్పాటు చేస్తామని మందకృష్ణ‌ చెప్పారు.

త‌న జాతి కోసం ఉద్య‌మ నాయ‌కుడిగా పోరాటం చేయ‌డం, అందుకోసం బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంపిక‌చేసుకోవ‌డం వ‌ర‌కు మంద‌కృష్ణ తీరు బాగానే ఉన్న‌ప్ప‌టికీ ఇందులో చంద్ర‌బాబు త‌ల్లిదండ్రుల సమాధులను తెర‌మీద‌కు తేవ‌డం ఒకింత ఎబ్బెట్టుగా ఉంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.