Begin typing your search above and press return to search.

ఎమ్మార్వో సజీవ దహనం .. మహిళలకి రక్షణ ఏది ?

By:  Tupaki Desk   |   4 Nov 2019 11:15 AM GMT
ఎమ్మార్వో సజీవ దహనం .. మహిళలకి రక్షణ ఏది ?
X
ఒక ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినపుడే మనకి జనమైన స్వాతంత్రం వచ్చినట్టు అని మహాత్ముడు చెప్పిన మాటలని అప్పుడప్పుడు మనం వింటూనే ఉంటాం. కానీ , ప్రస్తుత పరిస్థితుల్లో అర్ధరాత్రి కాదు కదా, కనీసం పట్టపగలే తిరగలేని పరిస్థితి ఉంది. దేశంలో రోజురోజుకి అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఢిల్లీ లో నిర్భయ పై జరిగిన అత్యాచారం తరువాత ఆమె పేరు మీద చట్టం కూడా తీసుకువచ్చారు.

కానీ , దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తమ ప్రేమని కాదంటే ..యాసిడ్ పోసేస్తున్నారు. మహిళా హత్యలు కేవలం ఇంట్లోనే అనుకుంటే పొరపాటే ఆఫీసుల్లో కూడా హత్యలు చేస్తున్నారు. సాధారణ ఉద్యోగుల నుంచి అధికారి స్థాయి మహిళల వరకు ఈ హత్యలు తప్పడం లేదు. తాజాగా జరిగిన ఒక సంఘటన తో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆఫీసుల్లో పనిచేసే ఆడవారు అందరూ ఇప్పుడు ప్రభుత్వాన్ని రక్షణ కోరుతున్నారు.

హైదరాబాదులోని అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ కార్యాలయంలో మహళా తహశీల్దార్ విజయారెడ్డిని ఓ దుండగుడు కిరోసిన్ పోసి తగలబెట్టేసాడు. ఆమె కార్యాలయంలోనే సజీవదహనం అయ్యింది. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని సురేశ్ గా గుర్తించారు. ప్రస్తుతం హయత్ నగర్ పోలీసులు అదుపులో హంతకుడు ఉన్నాడు. తన వెంట తెచ్చుకున్న కిరోసిన్ తో విజయను తగలబెట్టిన తర్వాత... సురేష్ తనపై కూడా కిరోసిన్ పోసుకుని నిప్పటించుకున్నాడు.

కాలిన గాయాలతో ఉన్న అతన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. హత్యకు గురైన విజయారెడ్డి స్వగ్రామం శాలిగౌరారం మండలం పెరకకొండారం. ఇది ఇలానే కొనసాగితే ... భవిష్యత్తులో మహిళలు ఆఫీస్ లకు వచ్చేందుకు కూడా వణికిపోవడం ఖాయం. ఇకపోతే ఆమెను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ప్రభుత్వం తక్షణమే ఉద్యోగుల భద్రతపై ఆలోచించాలని కోరాయి.