Begin typing your search above and press return to search.

గురి చూసి కొట్టినట్లుగా యోగికి దెబ్బేసిన సొంత పార్టీ ఎంపీ

By:  Tupaki Desk   |   28 Dec 2021 3:28 AM GMT
గురి చూసి కొట్టినట్లుగా యోగికి దెబ్బేసిన సొంత పార్టీ ఎంపీ
X
ప్రత్యర్థి పోరును ఏదోలా తట్టుకోవచ్చు. సొంతపార్టీ నేతలు విసిరే పంచ్ లను తట్టుకోవటం కష్టమే. ఇప్పుడు అలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్. పార్టీ అధినాయకత్వం తీరుతో ఇప్పటికే గుర్రుగా ఉన్న బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ.. ఏ మాత్రం అవకాశం చిక్కినా వదిలిపెట్టటం లేదు. యూపీ పీఠంపై కూర్చోవాలన్న ఆశ.. అత్యాశ అన్న విషయాన్ని మోడీషాలు ఇప్పటికే స్పష్టమైన సంకేతాల్ని ఇచ్చినప్పటికీ.. ఆశలు వదులుకోని ఈ బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత.. తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు.

కీలకమైన యూపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు నెలలు మాత్రమే సమయం ఉన్న వేళ.. యోగి సర్కారుపై ఒత్తిడి పెంచేలా వరుణ్ వ్యాఖ్యలు ఉన్నాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును సునిశితంగా విమర్శలు చేస్తూ.. ఇదెక్కడి పద్దతి? అన్న రీతిలో ఆయన ప్రశ్నలు ఉన్నాయి. కొవిడ్ నుంచి కోలుకుంటున్నామనుకునే వేళలో.. ప్రమాద సంకేతాల్ని ఇస్తున్న ఒమిక్రాన్ ఇప్పుడు హడలెత్తిస్తోంది.

ఒమిక్రాన్ భయాందోళనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పలు దేశాల్లో మాదిరి మన దేశంలో అలాంటి పరిస్థితి లేనప్పటికీ.. ముప్పును ముందుస్తుగా గుర్తించి.. అందుకు తగ్గట్లుగా నిర్ణయాల్ని తీసుకుంటున్నారు. ఇప్పటివరకు బూస్టర్ డోసు గురించి మాట్లాడని మోడీ సర్కారు.. మూడు రోజుల క్రితం హడావుడిగా బూస్టర్ డోసుతో పాటు.. 15 నుంచి 18 ఏళ్ల వయస్కులకు వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియకు సంబంధించి షెడ్యూల్ ను విడుదల చేయటం తెలిసిందే. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ జరిగే వేడుకులపై ఇప్పటికే పరిమితులు విధించటం తెలిసిందే.

పలు రాష్ట్రాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా రాత్రి వేళ కర్ఫ్యూను విధిస్తున్నారు. ఆంక్షల్ని అమలు చేస్తున్నారు. ఇలాంటివేళ.. గురి చూసి కొట్టిన రీతిలో ఎంపీ వరుణ్ గాంధీ వ్యాఖ్యలు ఉన్నాయి. పగటి పూట లక్షలాది మందితో ర్యాలీలు నిర్వహిస్తూ.. రాత్రివేళ ఆంక్షల్ని అమలు చేయటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఆరోగ్య సౌకర్యాలు లేని వేళలో ఇలా చేయటమా? అని నిలదీశారు. మన ప్రాధాన్యత ఒమిక్రాన్ కేసుల్ని తగ్గించటానికా? ఎన్నికలకా? అంటూ విసిరిన పంచ్.. యోగి సర్కారును మింగాలేక.. కక్కాలేని పరిస్థితిగా మార్చింది. ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పు పట్టిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మిగిలిన రోజుల్లో వరుణ్ గాంధీ వ్యాఖ్యల్ని సూచనగా తీసుకోవచ్చు. కానీ.. కీలకమైన ఎన్నికల వేళ.. ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఆయన ప్రశ్నించిన తీరు పార్టీకి ఇబ్బందికరమన్నట్లుగా చెప్పక తప్పదు. ఒకవైపు ఆంక్షలు అంటూనే.. మరోవైపు బరి తెగించినట్లుగా వ్యవహరిస్తున్న తీరు ద్వంద విధానంమన్నట్లుగా ఉంది. ఇదే విషయాన్ని ఎత్తి చూపిన వరుణ్ వైఖరి ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. కీలకమైన ఎన్నికల వేళ. వరుణ్ ను బుజ్జగించాల్సిన అవసరం కమలనాథులకు ఉందన్న విషయాన్ని గుర్తు చేసేలా ఆయన వైఖరి ఉందా? అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. మరి.. మోడీషాలు ఏం చేస్తారో చూడాలి.