Begin typing your search above and press return to search.

చిన‌బాబు తోడ‌ల్లుడికి ఎంపీ టికెట్ ప‌క్కా?

By:  Tupaki Desk   |   5 Oct 2018 12:35 PM GMT
చిన‌బాబు తోడ‌ల్లుడికి ఎంపీ టికెట్ ప‌క్కా?
X
హిందూపురం ఎమ్మెల్యే - సినీ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ పెద్ద‌ల్లుడు లోకేష్ ఇప్ప‌టికే మంత్రిగా కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్వినిని గీతం విద్యాసంస్థల అధినేత ఎంవీవీఎస్ మూర్తి మ‌న‌వ‌డు భ‌ర‌త్ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే 2019 ఎన్నిక‌ల్లో విశాఖ లోక్ స‌భ నుంచి భ‌ర‌త్ ను బ‌రిలోకి దించేందుకు బాల‌య్య స‌న్నాహాలు చేస్తున్నార‌ని కొంత‌కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ ఎంపీ సీటును త‌నకు గానీ, త‌న మ‌న‌వ‌డు భ‌ర‌త్ కు గానీ ఇవ్వాల‌ని మూర్తిగారు బాల‌య్య‌కు చెప్పార‌ట‌. ఈ ప్ర‌పోజ‌ల్ కు బాల‌య్య కూడా సానుకూలంగా స్పందించిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో మూర్తిగారు హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌డంతో దాదాపుగా భ‌ర‌త్ కు ఆ ఎంపీ టికెట్ ద‌క్క‌నుంద‌ని టీడీపీ శ్రేణుల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

40 ఈయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీ ఉన్న ఏపీ సీఎం చంద్ర‌బాబు రాజ‌కీయ చ‌తుర‌త గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఏ స్థానం నుంచి ఎవ‌రికి టికెట్ ఏ స‌మ‌యంలో ఇస్తే బాగుంటుందో బాబుగారికి బాగా తెలుసు. అందుకే భూమా నాగిరెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న వారసురాలిగా అఖిలప్రియకు మంత్రిప‌దవినిచ్చారు. తాజాగా, కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు వార‌సుడిగా శ్రావణ్ కు చాన్స్ ఇవ్వ‌బోతున్నారు. హరికృష్ణ కొడుకు కల్యాణ్ రామ్ కు శేరిలింగంపల్లి టికెట్ ఫిక్స్ అని పుకార్లు వస్తున్నాయి. ఇక‌, తాజాగా మూర్తి హఠాన్మరణంతో బాల‌య్య చిన్న‌ల్లుడు భ‌ర‌త్ కు చాన్స్ ద‌క్క‌నుంద‌ని టాక్. విశాఖ ప్రజల్లో మూర్తిగారికి ఉన్న గుడ్ విల్ ను వాడుకోవాల‌ని చంద్ర‌బాబు ప్లాన్. అదీగాక త‌న వియ్యంకుడు బాల‌య్య కూడా ఆ ప్ర‌పోజ‌ల్ ను గ‌తంలోనే చంద్ర‌బాబుకు విన్న‌వించారు. దీంతో, భ‌ర‌త్ కు టికెట్ దాదాపుగా క‌న్ ఫ‌ర్మ్ అని టాక్. ఇదే జ‌రిగితే...బాల‌య్య త‌న ఇద్ద‌రు అల్లుళ్లతో క‌లిసి తెలుగు రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతార‌న్న‌మాట‌.