Begin typing your search above and press return to search.

బీజేపీ ర‌థ‌సార‌థిగా బండి సంజ‌య్‌..ఇక దూకుడేనా?

By:  Tupaki Desk   |   11 March 2020 1:16 PM GMT
బీజేపీ ర‌థ‌సార‌థిగా బండి సంజ‌య్‌..ఇక దూకుడేనా?
X
ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. తెలంగాణ బీజేపీ నూత‌న అధ్య‌క్షుడి నియామ‌కం ఖ‌రారైంది. నాలుగు ఎంపీ సీట్లు సాధించడం తో, తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన‌ బీజేపీ అధినాయకత్వం ఈ దూకుడును మ‌రింత కొన‌సాగించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా కరీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్‌ను నియ‌మించింది. రాష్ట్ర బీజేపీని పరుగులు పెట్టే అధ్యక్షుని కోసం చేసిన‌ కసరత్తును కొలిక్కి తెచ్చింది.

పార్టీ అధ్యక్షుడి మార్పు ప్ర‌చారం నేప‌థ్యంలో అనేక చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రిగాయి. ప‌లువురు నేత‌ల పేర్లు ప్ర‌చారంలో నానాయి. నిజామాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏకంగా సీఎం కేసీఆర్ కూతురు కవితను ఓడించి, జాతీయస్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పేరు చాలామంది అధ్యక్ష పదవి కి సూచించిన‌ట్లు వార్తలు వ‌చ్చాయి. అర్వింద్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే, పార్టీ మరింత దూకుడుగా ముందుకెళుతుందని, అధిష్టానానికి కొందరు సీనియర్లు చెప్పార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కరీంనగర్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలిచి, ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌గా పాపులర్ అయిన‌ బండి సంజయ్‌కి అధ్యక్ష పదవి ఇవ్వ‌డం స‌రైన నిర్ణ‌య‌మ‌ని ఇంకొంద‌రు భావించారు. మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి ఇలా ప‌లువురు నేత‌ల పేర్లు తెర‌మీద‌కు వ‌చ్చాయి.

అయితే, యూత్‌లో ఫాలోయింగ్‌ ఉన్న సంజయ్‌ని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. సంజయ్‌కు ఆర్ఎస్ఎస్‌తో కూడా మంచి సంబంధాలు ఉండ‌టం క‌లిసి వ‌చ్చింది. దీంతో ఈయనకే అధ్యక్ష పదవి వస్తుందనే ప్రచారం నిజ‌మైంది. రాష్ట్రంలో పార్టీని ముందుకు తీసుకుపోవ‌డం, పార్టీ బ‌లోపేతం, యూత్‌లో ఫాలోయింగ్, సంఘ్ ఫీడ్ బ్యాక్ వంటి స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో ప్రధాని మోడీ, జాతీయ మాజీ అధ్యక్షుడు అమిత్ షా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా స‌మాచారం.