Begin typing your search above and press return to search.

హెరిటేజ్ ఫుడ్స్ నాదే.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   15 Aug 2021 8:51 AM GMT
హెరిటేజ్ ఫుడ్స్ నాదే.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు
X
విలక్షణ నటుడు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముక్కు మీద కోపం ఉంటుందని చాలామంది అంటారు కానీ.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడినప్పుడు అలానే ఉంటుంది. మనిషి ఎంత గంభీరంగా ఉంటారో అంతే సరదాగా ఉండే వ్యక్తి మోహన్ బాబు. నటనకు సంబంధించి ఆయన్ను ఎవరూ వంక పెట్టలేరు. తాజాగా ఆయనో చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి పలు సంచలన వ్యాఖ్యలు వచ్చాయి.

హెరిటేజ్ ఫుడ్స్ అన్నంతనే చంద్రబాబు ఫ్యామిలీది గుర్తుకు వస్తుంది. కానీ.. అసలు ఆ కంపెనీ తనదేనని.. తనను చంద్రబాబు మోసం చేశారంటూ మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఇష్యూ మీద మోహన్ బాబు నోట్లో నుంచి వచ్చిన వ్యాఖ్యల్ని యథాతధంగా చూస్తే.. ‘‘రాజకీయంగా నా మనసును గాయపరచింది చంద్రబాబు. హెరిటేజ్‌ ఫుడ్స్‌ నాదే.. ఆ సంస్థలో నా డబ్బు, నా షేర్‌ ఎక్కువ.. అతనిది తక్కువ. రాజశేఖర రెడ్డిగారు పాదయాత్రకి వెళ్లే ముందు మా ఇంటికి వచ్చారు.

నువ్వు, చంద్రబాబు ఫ్రెండ్సే కదా? ఏంటి మీ ఇద్దరికీ గొడవ? అన్నారు వైఎస్‌. ఆయన్ను అన్నపూర్ణ హోటల్‌లో నాకు పరిచయం చేసింది చంద్రబాబే. హెరిటేజ్‌లో నా డబ్బు ఇంత, చంద్రబాబుది ఇంత, వేరే వ్యక్తిది ఇంత.. ఇలా ఇలా మోసం చేశాడని చెప్పా. ‘వాళ్ల మామకే (ఎన్టీఆర్‌) వెన్నుపోటు పొడిచాడు.. నిన్ను మోసం చేయడంలో కొత్తేముంది?’ అన్నారు వైఎస్‌’’ అని వ్యాఖ్యానించిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

మరి.. ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నట్లు? ఇప్పుడీ విషయాన్ని ఎందుకు ప్రస్తావించినట్లు? అన్నది ప్రశ్నగా మారింది. అంతేకాదు.. తనను చంద్రబాబు పార్టీ నుంచి తీసేసిన విషయాన్ని పరోక్షంగా చెప్పుకొచ్చారు. అప్పట్లో తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నానని.. కానీ తాను పనికిరానని అప్పటి ముఖ్యమంత్రి పార్టీ నుంచి తీసేశారంటూ చంద్రబాబు పేరు ప్రస్తావన తేకుండా.. పరోక్షంగా చెప్పటం గమనార్హం. బీజేపీ మంచి పార్టీ అని.. కావాలని వెళ్లానని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వెళ్లానని.. నేనెప్పుడూ ఏదీ ఆశించలేదన్నారు.