Begin typing your search above and press return to search.

మోడీజీ.. ఒక దేశం.. ఒకే రేటు ఎందుకు అమలు చేయరు?

By:  Tupaki Desk   |   18 July 2021 5:30 AM GMT
మోడీజీ.. ఒక దేశం.. ఒకే రేటు ఎందుకు అమలు చేయరు?
X
కేంద్రంలోని మోడీ సర్కారు తరచూ చేసే ప్రకటనలు.. వ్యాఖ్యలు అద్యంతం ఆసక్తికరంగా ఉంటాయి. విన్నంతనే వావ్.. ఎంత బాగా ఆలోచిస్తున్నారో కదా? ఇప్పటివరకు పాలకులు ఎవరూ ఆలోచించని రీతిలో ఆలోచిస్తున్నారన్న భావన కలుగుతుంది. అయితే.. లాజిక్ ఎప్పుడైతే బయటకు వచ్చి.. మోడీ సర్కారు ప్రస్తావిస్తున్న అంశాల్ని.. ఇతర విషయాలకు అన్వయించి చూసినప్పుడు.. మాటల్లోని డొల్లతనం ఇట్టే కనిపిస్తుంది. ఒక దేశంలో ఒకే రకంగా ఉండాలన్న నినాదం విన్నంతనే ఎమోషన్ కు గురయ్యేలా చేస్తుంది. అదేం తప్పు కాదు.మరి.. ప్రజల మీద నిత్యం భారం మోపే అంశాల విషయాల్లోనూ ఇలాంటి నినాదాన్ని అమలు చేయాలి కదా? అలా ఎందుకు చేయట్లేదు? అన్నది అసలు ప్రశ్న.

మోడీ సర్కారు పుణ్యమా అని.. లీటరు పెట్రోల్ సెంచరీ దాటేయటమే కాదు.. అంతకు మించి అన్నట్లుగా రోజురోజుకీ వడివడిగా అడుగులు వేసుకుంటూ కొత్త రికార్డుల్ని క్రియేట్ చేసేంతలా ధరలు పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న పెట్రోల్.. డీజిల్ రేట్ల దెబ్బకు సామాన్యులు హాహాకారాలు చేస్తున్నారు. అయినా.. ప్రభుత్వాలు మాత్రం వాటిని అస్సలు పట్టించుకోవటం లేదు. ఇది సరిపోదన్నట్లుగా.. కొన్ని అంశాల్ని ప్రాతిపదికగా చేసుకొని ధరల్ని నిర్ణయించే తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏపీలో ఒక్కో చోట ఒక్కో ధరకు లీటరు పెట్రోల్ అమ్మటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. దూరాన్ని ప్రాతిపదికగా తీసుకొని ధరల్ని మార్పులు చేస్తున్నారు. ఇదే విధానాన్ని దేశంలోని పలు ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు. తెలంగాణలో కూడా హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ఒక ధర ఉంటే.. అదిలాబాద్ లో ఒక ధర.. వరంగల్ లో మరో ధర ఉంటుంది.కాకుంటే వ్యత్యాసం అంత ఎక్కువగా ఉండదు. కానీ.. ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ఏపీకి ఆ చివర ఉండే కుప్పంలో లీటరు పెట్రోల్ అత్యధికంగా రూ.110చొప్పున అమ్ముతున్నారు. అదే సమయంలో.. ఏపీకి ఈ చివర ఉండే శ్రీకాకుళం జిల్లాలోనీ కంచిలిలో లీటరు పెట్రోల్ రూ.108.92 ఉంది. ఏపీకి మధ్యలో ఉండే విజయవాడలో లీటరు పెట్రోల్ రూ.107.63 ఉంది.

ఎందుకిలా? అన్న ప్రశ్న వేస్తే.. పెట్రోల్.. డీజిల్ ను శుద్ధి చేసి.. సరఫరాకు సిద్ధం చేసే డిపోల నుంచి తరలించేందుకు అయ్యే ఖర్చు ఆధారంగా పెట్రోల్.. డీజిల్ ధరల్ని నిర్ణయిస్తున్నారు. దీంతో.. ఇంధన డిపోల నుంచి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు పంపిణీ చేసేందుకు అయ్యే ఖర్చును ప్రజల మీద నిర్మోహమాటంగా బాదేస్తున్నారు. ఈ బాదుడు జోరు చూస్తే.. ఒళ్లు మండిపోవాల్సిందే. విజయవాడ భవానీ పురంలో లీటరు పెట్రోల్ ధరకు బెంజి సర్కిల్ లో ఉండే ధరకు మధ్య 20 పైసలు చొప్పున తేడా ఉండటం కనిపిస్తోంది.

ఈ లెక్కన చూసినప్పుడు మిగిలిన ప్రైవేటు కంపెనీలు దేశంలో ఎక్కడెక్కడో ఉంటాయి. వాటి ధర దేశ వ్యాప్తంగా ఒకటే ధర ఉంటుంది. మరింత వివరంగా చెప్పాలంటే కుర్ కురే ప్యాకెట్ ఉందని అనుకుందాం. అది తయారయ్యే కేంద్రం ఒక చోట ఉంటే.. దేశం నలుదిక్కులా దాన్ని డెలివరీ చేస్తారు.కానీ.. పాకెట్ అన్ని చోట్ల ఒకే ధర ఉంటుంది. కుర్ కురేకు అప్లై అయ్యే రూల్.. పెట్రోల్.. డీజీల్ మీద ఎందుకు కాదు అన్నది ప్రశ్న. ఇదంతా ఒక ఎత్తుఅయితే.. ఒక దేశం.. ఒకటే రేటు అన్న మోడీ మాష్టారి కాన్సెప్టులోకి పెట్రోల్.. డీజిల్ ఎందుకు చేరవు?