Begin typing your search above and press return to search.

మోడీకే జై : విపక్షం వీక్... బీజేపీ దూకుడు

By:  Tupaki Desk   |   24 July 2022 1:30 AM GMT
మోడీకే జై  : విపక్షం వీక్... బీజేపీ దూకుడు
X
మోడీ అత్యంత బలవంతుడు అని రాస్తారు. మోడీని మించిన వారు లేరు అని అంటారు. ఇది ఒక వైపు మాత్రమే చూస్తే చెప్పే విశ్లేషణ. అలాగే వన్ సైడెడ్ గా చూసే చూపు ఇలాగే ఉంటుంది. కానీ అసలు నిజం అది కాదు మోడీ బలం అంతా విపక్షంలో ఉందని చెబుతారు. మోడీని బలవంతుడిని చేస్తున్నది కూడా దేశంలోని ప్రతిపక్షాలే అంటే అందులో తప్పు లేదు సరికదా అర్ధవంతమైన సమీక్ష ఉంటుందని అనుకోవాలి.

ఎనిమిదేళ్లుగా మోడీ దేశాన్ని పాలిస్తున్నారు. బీజేపీకి ఏ ఎన్నికలో కూడా గట్టిగా నలభై శాతాన్ని మించి ఓటింగ్ నమోదు కాలేదు. అంటే ఆ మిగిలిన అరవై శాతం ఓటింగ్ ఎవరిది ఎక్కడిది అంటే కచ్చితంగా దేశంలోని ప్రతిపక్షాలదే అని చెప్పాలి. అంటే బీజేపీ బలాన్ని మించి ఒకటిన్నర రెట్లు దేశంలోని విపక్షాలకు బలం ఉందని వివిధ ఎన్నికలు, ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల షేరింగ్ లెక్కలు కచ్చితంగా చెబుతున్నాయి.

కానీ నలభై శాతం లోపు ఓట్ల షేర్ తోనే మోడీ కానీ బీజేపీ కానీ దేశాన్ని ఎలా శాసిస్తోంది అంటే అక్కడే ఉంది తమాషా. అదంతా విపక్షాల అనైక్యత. వారిలో వారికి ఉన్న విభేధాలు. మోడీని బీజేపీ ఎదిరించే విషయంలో వారికి ఉన్న ఉదాశీనత. చిత్తశుద్ధి లోపం. ఈ రోజున కేసీయార్ మోడీ మీద గట్టిగా మాట్లాడుతున్నారు. దానికి కారణం తెలంగాణాలో బీజేపీ దూసుకుని వస్తోంది. రేపటి రోజున గులాబీ పార్టీని గద్దె దించి కాషాయ సేన తాము అధికారంలోకి రావాలని అనుకుటోంది. దాని కోసం ఎన్నో జిమ్మికులు ఎత్తులు పై ఎత్తులు వేస్తోంది.

ఒక విధంగా పీకల మీదకు వ్యవహారం రావడం వల్లనే కేసీయర్ మోడీ మీద పెద్ద గొంతు చేస్తున్నారు అని అంటున్నారు. దీనితో పాటు పశ్చిమ బెంగాల్ లో చూసుకుంటే అక్కడ మమతా బెనర్జీ కధ కూడా ఇంతే. ఆమె కూడా బీజేపీ టార్గెట్ గా ఉన్నారు. అందుకే ఆమె మోడీ వద్దు అంటున్నారు. బీజేపీ పోవాలి అని కూడా గట్టిగా నినదిస్తున్నారు. అంటే ఎక్కడైతే తమను టార్గెట్ చేసి గట్టిగా బిగిస్తున్నారో వారే బీజేపీ మీద మండుతున్నారు.

విపక్షాలు అంటే వీరేనా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులేనా అంటే కానే కాదు చాలా మంది ఉన్నారు. కానీ వారంతా ఏం చేస్తున్నారు అంటే తమకు బీజేపీతో ఈ రోజున సంబంధాలు బాగున్నాయని గమ్మున ఉన్న వారు అలాగే ఉన్నారు. మరి కొందరు సామంతులుగా మారి బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తున్నారు. ఇంకొందరు తమకు కేంద్రంతో ఎందుకొచ్చిన పేచీ ఈ రోజు బాగానే సాగుతోంది కదా అంటూ సైలెంట్ గా చోద్యం చూస్తున్నారు.

ఇక దేశంలో ఒకనాడు దశాబ్దాల పాటు రాజకీయలాను శాసిచిన కాంగ్రెస్ పరిస్థితి అంతకంతకు దేశంలో దిగజారుతోంది. ఆ పార్టీ అధినేత్రి, దేశంలో బలమైన రాజకీయ కుటుంబం అయిన గాంధీ నెహ్రూ వారసురాలు అయిన సోనియా గాంధీని ఈడీ ఆఫీసులో గంతల కొద్దీ విచారణ పేరిట వేధించినా దేశంలో కాంగ్రెస్ పార్టీ స్పందన అంతంతమాత్రంగా ఉంది. ఇక ఆ పార్టీకి మద్దతు ఇచ్చిన విపక్షాల గొంతు కూడా పేలవంగా ఉంటోంది.

అంటే తమ ఇష్టానుసారం దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలను వాడుకుంటున్నా కూడా కిమ్మనలేని దీన స్థితిలో విపక్షాలు ఉన్నాయని చెప్పాలి. విపక్షాల అనైక్యత కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ దేశంలొ గద్దె మీద కూర్చోవడానికి ఏలడానికి కారణం అయింది. ఇపుడు అదే అడ్వాంటేజిగా బీజేపీ తీసుకుంటోంది. ఈ రోజు బీజేపీని ఎదిరించే విషయంలో కూడా విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కానీ ఒక ఐక్యత కానీ లేనే లేవు అన్నది నిజం.

లేకపోతే రీసెంట్ గా జరిగిన రాష్త్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిని ద్రౌపది ముర్ముకు ఏకంగా విపక్షాల శిబిరం నుంచి 125 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు క్రాస్ ఓటింగ్ ఎలా చేయగలుగుతారు. అంటే ఇక్కడ ఉంటూ అక్కడ మోడీకి జై కొడుతూ తమ పబ్బం గడచిపోతే చాలు అనుకునే విపక్ష రాజకీయాల్లోకి శల్యుల వల్ల వారి సారధ్యం వల్లనే అంతకంతకు విపక్ష శిబిరం నీరు కారిపోతోంది.

ఇపుడు ఉప రాష్ట్రపతి ఎన్నికల వేళ తాము ఓటింగులో పాల్గొనబోమని మమతా బెనర్జీ చెప్పడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. ఈ కీలక సమయంలో తమలో తాము కలహించుకుని లుకలుకలు బయటపెట్టుకుని విపక్షాలు చేస్తున్న రాద్ధాతం కూడా అచ్చంగా బీజేపీకి కలసివచ్చేదే అంటున్నారు.

ఈ రోజుకు చూస్తే దేశంలో బీజేపీని నిలువరించే గట్టి ఆల్టర్నేషన్ లేదు అన్నది నిజం. దాంతోనే విపక్షాల బలహీనతను చూసి బీజేపీ దూకుడు చేస్తోంది. గట్టిగా రెచ్చిపోతోంది. అంతే ధీమాగా 2024 ఎన్నికల్లోనే కాదు మరో పాతికేళ్ల పాటు తమదే దేశంలో అధికారం అని జబ్బలు చరుస్తోంది. మరి చివరిగా కొన్ని కీలక ప్రశ్నలు. బీజేపీ దేశంలో అంత బలంగా ఉందా. తేడా గల పార్టీ అని చెప్పుకునే బీజేపీ దేశంలో అన్ని వర్గాలను పూర్తిగా నచ్చేసిందా, గొప్పగా పాలిస్తోందా. నిజానికి బీజేపీ బలం మోడీని శక్తిమంతుడిగా చేస్తోందా. వీటిని ఒక్కటే జవాబు అవన్నీ కానే కాదు అని. విపక్షాల వీక్ నెస్ మీద కాషాయదళం చెలగాట ఆడుతోందని. ఇదే నిజం మరి.