Begin typing your search above and press return to search.

టార్గెట్ మోడీ.. ముకుల్‌తో స్పీడ్ పెంచిన మ‌మ‌త‌!

By:  Tupaki Desk   |   14 Jun 2021 2:30 AM GMT
టార్గెట్ మోడీ.. ముకుల్‌తో స్పీడ్ పెంచిన మ‌మ‌త‌!
X
ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి చెక్ పెట్టాలి. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి మోడీకి వ్య‌తిరేకంగా కూట‌మి ని త‌యారు చేసి.. కేంద్రంలో చ‌క్రం తిప్పాలి. -ఇదీ.. బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కీల‌క‌మైన టార్గెట్‌. ఇటీవ‌ల జ‌రిగిన బెంగాల్ ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ఆమె.. అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు(బీజేపీ యేత‌ర‌) లేఖ‌లు సంధించారు. ఇక‌, బెంగాల్‌లో ముచ్చ‌ట‌గా మూడో సారి అధికారం చేప‌ట్టాక‌.. మ‌మ‌త త‌న ప్ర‌యత్నాలను ముమ్మ‌రం చేస్తున్నారు.

"ముందు బంగాల్లో విజయం... తర్వాత దిల్లీలో పరివర్తన్(మార్పు)`` అని మార్చి 18న బంగాల్ ఎన్నికల ప్రచార సభలో టీఎంసీ అధినేత్రి మ‌మ‌త‌ చెప్పిన మాటలివి. వీటిని నిజం చేసుకునేందుకు ఆ పార్టీ చురుగ్గా అడుగులు వేస్తోంది. కొన్ని రోజుల కింద‌ట బీజేపీని వీడిన ముకుల్ రాయ్‌(గ‌తంలో మ‌మ‌త‌కు రైట్ హ్యాండ్‌)ను మ‌మ‌త వెనుకాముందు ఆలోచించ‌కుండానే.. పార్టీలోకి తీసుకున్నారు. అంతేకాదు, ఆయ‌న‌కు మంచి ప‌ద‌వి ఇచ్చేందుకు కూడా ఆమె ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

జాతీయ రాజకీయాల్లో సీనియర్ నేత ముకుల్ రాయ్. ఏ పార్టీ బ‌లం ఎంత‌.. కేంద్రంలో పుంజుకునేందుకు ఏం చేయాలి అనే విష‌యాల‌పై ముకుల్‌కు మంచి ప‌ట్టుంది. దీంతో ముకుల్‌ అనుభవాన్ని ఆసరాగా చేసుకుని... ఈ వ్యూహాలను అమలు చేయాలని మ‌మ‌త భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ముకుల్ కూడా మ‌మ‌త ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా వ్యూహాలు రెడీ చేసుకుని ముందుకు సాగుతున్నారు.

తాజాగా ముకుల్‌.. మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ త‌న‌యుడు అభిజిత్‌తో భేటీ అయ్యారు. దీంతో అభిజిత్ త్వ‌ర‌లోనే మ‌మ‌త ప‌క్క‌కు చేరిపోయే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తోంది. అబిజిత్‌కు కూడా జాతీయ స్థాయిలో మంచి పేరుంది. పైగా ప్ర‌ణ‌బ్ కోట‌రీ అంతా కూడా టీఎంసీకి అద‌న‌పు బ‌లం కానుంది. అదేవిధంగా ముకుల్ రాయ్.. టీఎంసీ గూటికి తిరిగి చేరిన తర్వాత చాలా మంది బీజేపీ నాయకులు, ముఖ్యంగా ముకుల్కు ఆప్తులు, సన్నిహితంగా ఉన్నవారు తృణమూల్ కాంగ్రెస్లో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు.

2022లో దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో జాతీయ రాజకీయాల్లో మంచి పట్టున్న ముకుల్ రాయ్కు ఎలాంటి పదవి ఇస్తే.. జాతీయ స్థాయిలో తృణమూల్ కాంగ్రెస్ బలపడేందుకు అవకాశం ఉంది? అన్న దానిపైనా టీఎంసీలో చ‌ర్చ సాగుతోంది. రాయ్.. సలహాలు, వ్యూహాలతో వచ్చే ఏడాది జరిగే ఆరు రాష్ట్రాల ఎన్నికల్లో క్రియాశీల పాత్ర పోషించాలని టీఎంసీ భావిస్తోంది.

మ‌రోవైపు బీజేపీకి ప‌ట్టున్న రాష్ట్రాల్లో మ‌మ‌త పార్టీ పాగా వేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రం అయిన త్రిపురలో 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం త్రిపురలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో ఈశాన్య రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ పాగా వేసేందుకు యత్నిస్తోంది. ఈ మేరకు ముకుల్ రాయ్తో.. పార్టీ చర్చలు జరుపుతోంది. ఇలా పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతున్న టీఎంసీ అధినేత్రి మ‌మ‌తాబెన‌ర్జీ.. మోడీకి చెక్ పెట్టేదిశ‌గా వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్నారు. మ‌రి ఏమేర‌కు విజ‌యం ద‌క్కించుకుంటారో చూడాలి.