Begin typing your search above and press return to search.

టార్గెట్ 2024కు ముందు బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీయనున్న మోడీ

By:  Tupaki Desk   |   2 May 2022 6:28 AM GMT
టార్గెట్ 2024కు ముందు బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీయనున్న మోడీ
X
మోడీ ఎన్నికల వ్యూహాలు ఎంత ముందుచూపుతో.. తెలివిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంలో దేశ వ్యాప్తంగా మోడీ వ్యతిరేక గాలి వీస్తుందని.. ఆయనకు ఇబ్బందులు తప్పవన్న మాట బలంగా వినిపించింది. అయితే.. ఆ వాదనలో ఎలాంటి నిజం లేదని.. తాము గెలుస్తామని మోడీ నమ్మకంగా చెప్పటం.. అందుకు తగ్గట్లే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఉండటం తెలిసిందే.

బలమైన సెంటిమెంట్ తో పాటు.. హిందుత్వ ఎజెండాను బలంగా నమ్ముకున్న ఆయన.. మరో రెండేళ్లలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఒక బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీస్తున్నారని చెప్పాలి. ఎన్నోఏళ్లుగా చర్చ జరుగుతూ.. కోట్లాది మంది డిమాండ్ చేస్తున్న యూనిఫాం సివిల్ కోడ్ ను మోడీ సర్కారు టేకప్ చేయటం ద్వారా ఎన్నికల స్వరూపం మొత్తం మారిపోతుందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికలకు ముందుగా దేశమంతా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఒకే దేశం ఒకే సివిల్ కోడ్ ఉండాలన్న వాదనలో న్యాయం ఉంది. లౌకిక దేశంలో మతాలకు అనుగుణంగా చట్టాలు ఏమిటి? చట్టం ముందు.. కులం.. మతం.. ప్రాంతం లాంటివి అన్ని సమానంగానే ఉండాలి కదా? అందుకు భిన్నంగా మతానికి అనుగుణంగా చట్టం ఉండటం ఎంతవరకు సబబు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడిన మాటల్లో.. ఉమ్మడి పౌరస్మృతి అమలుపై సంకేతాలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

ఈ వాదనకు బలం చేకూరేలా ఉత్తరప్రదేశ్.. ఉత్తరాఖండ్.. మధ్యప్రదేశ్.. అసోం రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. మంత్రులు పౌరస్మృతి గురించి కీలక వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం. ఇదిలా ఉంటే.. పౌరస్మృతికి సంబంధించి ఉత్తరాఖండ్ లో ఏకంగా పైలెట్ ప్రాజెక్టును చేపట్టబోతున్నట్లు చెబుతున్నారు. ఇక్కడ ఎదురయ్యే అనుభవాల ఆధారంగా దేశమంతా అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు.

అయితే.. దీనిపై ముస్లింలలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిజానికి పౌరస్మృతి అమలు బీజేపీ ఎన్నికల ఎజెండాలో ఎప్పటి నుంచో ఉంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఇదే ప్రధాన ప్రచారాంశం అవుతుందని.. దీంతో హిందూ ఓటు బ్యాంకు మరోసారి ఏకమై.. మోడీ చేతికి అధికారాన్ని ఇచ్చేలా చేస్తుందంటున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే గోవాలో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తున్నారు. పలువురు బీజేపీ ముఖ్యమంత్రులు పౌరస్మృతికి అనుకూలంగా మాట్లాడటం మొదలు పెట్టారు.

ఇదంతా చూస్తుంటే.. ఈ అంశాన్ని ప్రచార ఆయుధంగా చేసుకొని రానున్న ఎన్నికలకు మోడీ వెళ్లటం కానీ.. లేదంటే దాన్ని చట్టంగా తీసుకొచ్చేయటం ద్వారా తిరుగులేని అధిక్యతను ప్రదర్శించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే దీనిపై మజ్లిస్ అధినేత అసుదుద్దీన్ ఓవైసీ మాత్రం విరుచుకుపడుతున్నారు. రాజ్యాంగంలో చెప్పిన పౌరస్మృతి గురించి మాట్లాడే వారు.. అదే రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో సంపూర్ణ మద్యనిషేధం గురించి కూడా చెప్పారని.. దాని సంగతేమిటి? అని ప్రశ్నిస్తున్నారు.