Begin typing your search above and press return to search.

పాక్ పై అటోఇటో తేలిపోయేది నేడే..

By:  Tupaki Desk   |   24 Sep 2016 11:38 AM GMT
పాక్ పై అటోఇటో తేలిపోయేది నేడే..
X
ఈ ఏడాది రెండుసార్లు... ఒకటి పఠాన్ కోట్ లో రెండోది యూరీలో దొంగ దెబ్బ తీసిన పాకిస్థాన్ పీచమణిచేందుకు భారత్ యుద్ధానికి దిగుతుందా లేదా అన్నది కొద్ది రోజులుగా భారత ప్రజలకు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తాజాగా ప్రధాని మోడీ ఈ రోజు తన నివాసానికి త్రివిధ దళాధిపతులను పిలిపించుకుని మాట్లాడడంతో ఏదో జరుగుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు రాజస్థాన్ లో సరిహద్దు దిశగా మన ట్యాంకర్లు పెద్ద సంఖ్యలో వెళ్తుండడం కూడా యుద్ద సన్నాహాలే అంటున్నారు. అయితే... ఇవన్నీ ఊహాగానాలే కావడంతో ఈ రోజు సాయంత్రం మోడీ దీనిపై ప్రకటన చేస్తారని... యుద్ధమా... సంయమనమా.. అన్నది తేలిపోతుందని చెబుతున్నారు.

ప్రధాని న‌రేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం కేర‌ళలోని కోజికోడ్ లో జ‌ర‌గ‌నున్న బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడబోతున్నారు... యూరీ ఆర్మీ బేస్ క్యాంప్‌ పై దాడి జ‌రిగిన త‌ర్వాత ఆయన ఓ బ‌హిరంగ స‌భ‌లో ప్రసంగించ‌డం ఇదే మొద‌టిసారి. దీంతో బహిరంగ సభలో ప్రధాని మన దేశ వైఖరిని వెల్లడిస్తారని భావిస్తున్నారు. పాకిస్థాన్‌ పై మోదీ ఎటువంటి వ్యాఖ్యలు చేస్తార‌న్న విష‌యం ఆస‌క్తిక‌రంగా మారింది. అంత‌ర్జాతీయ స‌మాజం ముందు పాక్‌ ను ఏకాకి చేయాలని తీర్మానించిన ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రధాని ప‌బ్లిక్‌ గా ఎలా వివ‌రిస్తార‌న్న ఉత్సుక‌త ఏర్పడింది.

మోడీ రాక సంద‌ర్భంగా కోజికోడ్‌ లో భారీ భ‌ద్రత‌ను ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంట‌ల‌కు ఆయన కోజికోడ్ చేరుకుంటారు. కాగా మోడీ తన ప్రసంగంలో యుద్ధ అవకాశాల గురించి మాట్టాడకపోయినా పాకిస్థాన్ విషయంలో చూపించే వైఖరి, ఆగ్రహావేశాల ఆధారంగా ఏం జరగనుందో అర్థమవుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.