Begin typing your search above and press return to search.

మోడీ ఫ్రమ్ హైదరాబాద్ : నాలుగు రోజులు అక్కడే మకాం

By:  Tupaki Desk   |   26 Jun 2022 4:30 AM GMT
మోడీ ఫ్రమ్ హైదరాబాద్ : నాలుగు రోజులు అక్కడే మకాం
X
ప్రధాని నరేంద్ర మోడీ ఉంటే ఢిల్లీ లేకపోతే విదేశాలు అలా ఎనిమిదేళ్ళ ఆయన రాజకీయ జీవితం ఉంటూ వచ్చింది. ఇక ఎన్నికలు జరుగుతాయి అన్న రాష్ట్రాలలో ఆయన ఏడాది ముందుగానే సుడిగాలి పర్యటనలు చేస్తూ ఉంటారు. అక్కడే గిరి గీసుకుని మరీ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూంటారు. అయితే మాత్రం ఎక్కడైనా ఉంటే గింటే ఒక రోజు మాత్రమే ప్రధాని ఉన్న సందర్భాలు అవి కూడా అరుదుగా కనిపిస్తాయి.

ఇక దక్షిణాదిన ఆయన పర్యటనలు ఈ మధ్య దాకా బహు తక్కువ. ఇలా వచ్చి ఆలా వెళ్ళిపోవడమే జరుగుతూ వచ్చింది. కానీ తెలంగాణా మీద ఫోకస్ పెట్టాక బీజేపీ కానీ మోడీ కానీ హైదరాబాద్ అంటే మోజు పెంచుకుంటున్నారు. దానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా ఇపుడు కలసివస్తున్నాయి. అలా అనడం కంటే చూసి చూసి హైదరాబాద్ లో ఈ మీటింగ్స్ పెట్టారు అనుకోవాలి.

ఇక ప్రధాని ఈ కార్యక్రమాల కోసం హైదరాబాద్ వచ్చి ఏకంగా నాలుగు రోజుల పాటు మకాం పెడతారు అని వార్తలు వస్తున్నాయి. అదెలా అంటే జూలై 2న మధ్యాహ్నానికి ప్రధాని మోడీ హైదరాబాద్ చేరుకుంటారు. మూడవ తేదీన పెరేడ్ గ్రౌండ్స్ భారీ బహిరంగ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతారు. ఈ సందర్భంగా కేసీయార్ పాలన మీద ఆయన హాట్ హాట్ కామెంట్స్ చేస్తారు అని తెలుస్తోంది.

ఇక నాలుగవ తేదీన ఏపీలోని భీమవరం వెళ్ళి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలలో పాల్గొంటారు. అలాగే అమరావతిలో ఎయిమ్స్ లో అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. అటునుంచి మళ్లీ హైదరాబాద్ కి మోడీ విమానం ఎగిరిపోతుంది. అలా 4వ తేదీ రాత్రితో పాటు 5వ తేదీ కూడా మోడీ ఫ్రమ్ హైదరాబాద్ గానే కధ సాగుతుంది.

మరి ఏకంగా నాలుగు రోజుల పాటు ప్రధాని హైదరాబాద్ లో ఉండడం అంటే మామూలు విషయం కాదు, ఆయన వెంట అమిత్ షా తో పాటు కీలక నేతలు అందరూ ఉంటారు. అంతా కలసి టీయారెస్ ని గద్దె దించేందుకు పద్మవ్యూహాన్నే రచిస్తారు అని తెలుస్తోంది. తమ ప్లాన్ హైదరాబాద్ నడిబొడ్డునే డిజైన్ చేసి అక్కడ షార్ప్ గా అమలు చయించడం కోసమే మోడీ షాలు రోజుల తరబడి హైదరాబాద్ లో ఉంటారు అని అంటున్నారు.

ఇక మరో మాట ఏంటి అంటే ప్రధాని నాలుగు రోజుల మకాం అన్నది ఆరంభం మాత్రమేనని చెబుతున్నారు. ఇక మీదట ఆయన ఎన్ని సార్లు వస్తారో లెక్క వేసుకోవాల్సిందే. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతున్న తెలంగాణా మీద పూర్తి ఆశలు పెట్టుకున్న బీజేపీ పెద్దలు ఢిల్లీ టూ హైదరాబాద్ షటిల్ సర్వీస్ చేసినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. సో మోడీ గురి పెట్టేశారు. మరి గులాబీ పార్టీ పని పట్టేసినట్లేనా. ఏమో చూడాలి.