Begin typing your search above and press return to search.

ఎర్రకోట ప్రసంగంలో మోడీ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   15 Aug 2021 4:30 AM GMT
ఎర్రకోట ప్రసంగంలో మోడీ సంచలన వ్యాఖ్యలు
X
భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు త్రివిధ దళాల వందనం స్వీకరించారు. కరోనా కారణంగా ఈసారి తక్కువ మందిని మాత్రమే ఎర్రకోటపైకి తీసుకొచ్చారు.

ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్, లఢక్ లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా తీర్చిదిద్దామని.. అక్కడ అభివృద్ధి వేగవంతమైందని ప్రధాని మోడీ అన్నారు. జమ్మూకశ్మీర్ వికేంద్రీకరణతో ఆ రెండు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని మోడీ చెప్పారు. జమ్మూకశ్మీర్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని మోడీ తేల్చిచెప్పారు. ప్రజా ప్రతినిధుల పాలనను అక్కడ ఏర్పాటు చేస్తామని మోడీ తెలిపారు.

లఢక్ కు ఆధునిక మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నామని మోడీ స్పష్టం చేశారు. ఇండస్ సెంట్రల్ యూనివర్సిటీని అక్కడ ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని రాష్ట్రాలతో పోటీపడేలా జమ్మూకశ్మీర్ , లఢక్ లను అత్యాధునికంగా తీర్చిదిద్దుతామన్నారు.

దళితులు, వెనుకబడిన వర్గాలు, గిరిజనులు, జనరల్ కేటగిరీలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల ప్రయోజనాల కోసం పలు చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని మోడీ అన్నారు. ఓబీసీ చట్టాన్ని తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఓబీసీ గుర్తింపు రాష్ట్రాలకే ఇచ్చామన్నారు. రైతుల కోసం నగదు బదిలీ తీసుకొచ్చామని మోడీ అన్నారు.

దేశంలో సంస్కరణలు మరింత వేగవంతం చేస్తామని.. దీనికోసం స్మార్ట్ గవర్నెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నామని మోడీ అన్నారు. స్మార్ట్ గవర్నెన్స్ లో దేశం సరికొత్త అధ్యాయాన్ని రచిస్తోందని చెప్పుకొచ్చారు.

ఇక 75వ స్వాతంత్ర్య దినం సందర్భంగా 75 వారాల్లో దేశంలోని అన్ని ప్రాంతాలను కనెక్ట్ చేసేలా 75 వందే భారత్ రైళ్లను నడిపిస్తామని ప్రధాని మోడీ చెప్పారు. అలాగే ప్రధానమంతి గతి శక్తి పథకం కింద లక్షల కోట్లతో నేషనల్ ఇన్ ఫ్రాస్టక్చర్ మాస్టర్ ప్లాన్ ప్రారంభిస్తామని తెలిపారు.