Begin typing your search above and press return to search.

ఫస్ట్ టైమ్ : జగన్ కోరికకు మోడీ నో...?

By:  Tupaki Desk   |   19 May 2022 9:30 AM GMT
ఫస్ట్ టైమ్ : జగన్ కోరికకు మోడీ నో...?
X
కేంద్రంలోని బీజేపీతో వైసీపీ సంబంధాలు చాలా చక్కగా ఉన్నాయనే చెప్పాలి. ఈ మధ్యనే ఏపీకి కోరుకున్న ప్రభుత్వ ప్రధాన కార్దర్శి సమీర్ శర్మను మరో ఆరు నెలలు కేంద్రం పొడిగిస్తూ ప్రధాని ఆఫీస్ అసాధరణ నిర్ణయం తీసుకుంది. ఇక అనేక విషయాలలో ముఖ్యంగా రుణ పరిమితులు ఎలా ఉన్నా ఏపీని అప్పుల విషయాన ఆదుకుంటూ కేంద్రం సహకరిస్తోంది అని చెబుతారు. ఇవన్నీ ఇలా ఉంటే ఒక కీలకమైన రాజకీయ నిర్ణయం విషయంలో మోడీ సర్కార్ జగన్ కి ఎంత మేరకు సహకరిస్తుంది అన్నదే ఇక్కడ చర్చగా ఉంది.

జగన్ ఏడాది పదవీ కాలాన్ని త్యాగం చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు అని అంటున్నారు. దాని కోసమే ఆయన రాజకీయ దూకుడు ఈ మధ్యన చేస్తున్నారు అని కూడా ప్రచారం సాగుతోంది. ఒక విధంగా ఏపీలో ఎన్నికల వేడిని అధికార పార్టీయే ముందుండి రాజేసింది అని కూడా చెబుతున్నారు. ఈ నేపధ్యంలో వైసీపీ ప్లీనరీని జూలైలో నిర్వహించి పార్టీ కమిటీలను బూత్ లెవెల్ వరకూ వేసి ఎన్నికలకు రెడీ కావడమే వైసీపీ చేసే తరువాయి పని అంటున్నారు.

అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలకు వెళ్ళాలి అన్నది వైసీపీ బలమైన ఆలోచనగా చెబుతున్నారు. దాని కోసమే తెర వెనక కసరత్తు అంతా జరుగుతోంది అని అంటున్నారు. ఇప్పటికైతే ఏపీలో విపక్షాలు పెద్దగా సర్దుకోలేదు. జనాల్లో వ్యతిరేకత ఉన్నా అది పీక్ స్టేజికి చేరలేదు. దాంతో కొన్ని సీట్లు తగ్గినా మరోమారు అధికారం అయితే గ్యారంటీ అన్న నివేదికలు ఏవో వైసీపీ పెద్దల వద్ద ఉన్నాయని చెబుతున్నారు.

ఇక అప్పులు కూడా దొరకక సంక్షేమ పధకాలు ఆపేశామన్న అపకీర్తిని తెచ్చుకోకుండా వాటిని కొనసాగిస్తూనే ఎన్నికలకు వెళ్ళాలి అన్నది కూడా వైసీపీ యోచన. మరి పధకాలు ఆగే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే ఆర్ధికంగా ఇబ్బందుల వల్ల. ఒక ఏడాది పాటు పంటి బిగువన ఈ ఆర్ధిక భారాన్ని మోసి పధకాలు కంటిన్యూ చేస్తే వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్ళి అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్నది వైసీపీ ప్లాన్ అని చెబుతున్నారు.

దాంతో ఏడాది ముందుగా ఎన్నికలకు వైసీపీ వెళ్ళనుంది అంటున్నారు. అయిత వైసీపీ ఈ రకంగా ప్రతిపాదిస్తే దాన్ని కేంద్రం ఆమోదించాలి. కేంద్రం ఒప్పుకుని పచ్చ జెండా ఊపితేనే వైసీపీ ముందస్తు కల సాకారం అవుతుంది. కానీ దానికి మోడీ అమిత్ షాలు మాత్రం పక్కాగా నో చెబుతారు అనే అంటున్నారు. దేని వల్ల అంటే తెలంగాణా రాష్ట్రాన్ని చూపించి అంటున్నారు.

తెలంగాణాలో చూస్తే కేసీయార్ కి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళలని ఉంది. ఆయన గతంలో బీజేపీతో మంచి రిలేషన్స్ మెయిన్ టెయిన్ చేసి ఆరు నెలల ముందు ఎన్నికలను తెచ్చుకుని గెలిచారు. ఇపుడు కూడా ఆరు నెలల ముందు ఎన్నికలకు వెళ్ళాలని చూస్తున్నారు. అలా చూసుకుంటే 2023 మార్చి లోనే టీయారెస్ ఎన్నికలకు వెళ్ళే చాన్స్ ఉంది. దాని కోసం ఆయన కూడా కేంద్రానికి అర్జీ పెట్టుకుంటారు.

కానీ అక్కడ బద్ధ శత్రువులుగా ఉన్న బీజేపీ టీయారెస్ వైఖరి వల్ల ముందస్తుకు ససేమిరా కేంద్రం అంగీకరించే అవకాశం లేదు, పైగా కేసీయార్ ని పూర్తి స్థాయిలో అధికారంలో కొనసాగిస్తే వచ్చే భారీ ప్రజా వ్యతిరేకతను తెలంగాణాలో సొమ్ము చేసుకోవాలని బీజేపీ చూస్తోంది. దాంతో కేసీయార్ ముందస్తుకు వెళ్ళాలంటే జగన్ కూడా ముందస్తు మంత్రం జపించాలి.

మరి జగన్ కి మోడీతో మంచి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి మోడీ ఓకే అనేస్తే కేసీయార్ నెత్తిన పాలు పోసినట్లే. ఆయన కూడా ఏపీతో పాటే ఎన్నికలకు వెళ్తారు. అలా జరగడం బీజేపీకి అసలు ఇష్టం ఉండదు కాబట్టి ఇక్కడ జగన్ కి కూడా నో చెప్పే చాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. దాంతో జగన్ కూడా ముందస్తు అంటే 2023 చివరి దాకా ఆగి తెలంగాణాతో పాటే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. మరి అప్పటిదాకా ఏపీలో ఆర్ధిక వనరులు సరిపోతాయా. అప్పులు తెచ్చి అయినా సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించే సీన్ ఉందా. ఏమో చూడాలి. మొత్తానికి మోడీ ఫస్ట్ టైమ్ జగన్ కోరికకు నో చెబుతారా అన్న చర్చ అయితే ఉంది.