Begin typing your search above and press return to search.

మోడీనే మా బ్రహ్మాస్త్రం.. 400 సీట్లు పక్కా.. ఎవరన్నారంటే?

By:  Tupaki Desk   |   10 Sep 2022 7:32 AM GMT
మోడీనే మా బ్రహ్మాస్త్రం.. 400 సీట్లు పక్కా.. ఎవరన్నారంటే?
X
అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని మోడీ సర్కారు మీద ఆయన చేసిన వ్యాఖ్యలు.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఉన్న అవకాశాల గురించి ఆత్మవిశ్వాసంతో చెప్పుకొచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తమకు ప్రత్యేక అస్త్రాలంటూ ఏమీ లేవని.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే తమ బ్రహ్మాస్త్రం అంటూ వ్యాఖ్యానించారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారాన్ని చేపడుతుందని.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లను సొంతం చేసుకోనున్నట్లు జోస్యం చెప్పారు.

శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన గణేశ్ నిమజ్జనకార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా హాజరైన ఆయన.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాల్ని ప్రస్తావించారు. వచ్చే 30 ఏళ్ల వరకు బీజేపీ పాలనే సాగుతుందన్న ఆయన.. బీజేపీ ముక్త్ భారత్ కంటే ముందు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్నారు. బీజేపీకి ప్రజల ఆదరణ ఉందని.. కేసీఆర్ వద్ద చాలా డబ్బులు ఉన్నాయని.. ఆయన జాతీయ పార్టీ పెట్టుకోవచ్చన్నారు.

'కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టుకోవచ్చు. అందులో అభ్యంతరమేముంది? విపక్షాల ఐక్యత అంటున్నాయి. అవి ఐక్యంగా లేనిదెప్పుడు?' అని ప్ఱశ్నించారు. కేంద్రంలోకి అధికారంలోకి వస్తే కేసీఆర్ ప్రతి ఒక్కరికీ ఉచిత కరెంటు ఇస్తామని వాగ్ధానం చేస్తున్నారని ప్రశ్నించగా.. కేసీఆర్ మాటల్ని నమ్మరన్నారు. దేశంలోనూ.. తెలంగాణలోనూ తమదే అధికారమన్న ఆయన.. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ నిజాం రాజ్యాన్ని.. రజాకార్ల పాలనను రానీయమన్నారు.

బంగ్లాదేశ్ ప్రధాని హసీనా పర్యటన వేళలో.. అసోం సీఎం మాట్లాడుతూ అఖండ భారత్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించినప్పుడు.. తన ఉద్దేశం అది కాదని రాహుల్ భారత్ జోడో అంటున్నారని.. భారత్ లోని రాష్ట్రాలు విడివిడిగా లేవన్నారు.'అన్నీ భారత్లోనే ఉన్నాయి కదా? కొత్తగా జోడించేదేముంది? అంతగా జోడించాలంటే కాంగ్రెస్ విడదీసిన దేశాల్ని జోడించి అఖండ భారత్ కు నాంది పలకాలని మాత్రమే చెప్పా' అని పేర్కొన్నారు.

అసోంలోని అల్ కాయిదా ఇన్ఇండియన్ సబ్ కాంటినెంట్ ఉగ్రవాదులు భారీ సంఖ్యలో అరెస్టు అయిన నేపథ్యంలో మదర్సాల కూల్చివేత ఎంతవరకు సబబు?అని ప్రశ్నించగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులకు షెల్టరిచ్చే వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు.

గోల్‌పరా, మోరీగావ్‌, గోగీగావ్‌, బార్‌పేట లోని మదర్సాల్లో పిల్లలకు పాఠాలు బోధించేదేమి లేదు. కేవలం ఉగ్రవాదులకు షెల్టర్‌ ఇచ్చి.. యువతను జిహాద్‌ వైపు ఆకర్షించడం తప్ప. అందుకే వాటిని కూల్చేశాం. అలాంటి సంస్థలేమైనా ఉంటే కూల్చివేతలు కొనసాగుతాయి' అని స్పష్టం చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.