Begin typing your search above and press return to search.

మోడీ ప్రశ్నలతో బీజేపీ ఎంపీలు బిక్కముఖం

By:  Tupaki Desk   |   16 March 2016 7:02 AM GMT
మోడీ ప్రశ్నలతో బీజేపీ ఎంపీలు బిక్కముఖం
X
ఇప్పుడు నడుస్తున్నది పరీక్షల కాలం. పిల్లల పరీక్షలేమో కానీ.. పెద్దలకు సైతం పరీక్షలే. పిల్లల మార్కుల మీద వారు పెట్టుకునే ఆశలు ఒత్తిడిగా మారి.. పిల్లల మీద విపరీతమైన భారాన్ని మోపుతుంటాయి. మార్కులు.. ర్యాంకుల పరుగు పందెంలో అటు పిల్లలు.. ఇటు పెద్దవాళ్లు ప్రశాంతంగా ఉండని పరిస్థితి. వీరే కాదు.. బీజేపీ ఎంపీలకు దాదాపుగా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దీనికి కారణం ప్రధానమంత్రి నరేంద్రమోడీ. యూపీ బీజేపీ ఎంపీలతో భేటీ అయిన సందర్భంగా ఆయన కొద్దిసేపే మాట్లాడినా.. వారందరికి చెమటలు పట్టించారు.

వచ్చే ఏడాది యూపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై యూపీకి చెందిన బీజేపీ ఎంపీలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హాజరైన మోడీ.. తన సహచర ఎంపీలను ఉద్దేశించి చాలా క్లుప్తంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రెండంటే రెండే ప్రశ్నలు వేశారు. ఆ రెండింటికి సమాధానాలు చెప్పలేక యూపీ బీజేపీ ఎంపీలు బిక్కముఖం వేసిన పరిస్థితి.

అంతమంది ఎంపీలకు సమాధానం తట్టని రీతిలో మోడీ వేసిన ఆ రెండు ప్రశ్నలేమంటే.. 1. దీన్ దయాళ్ గ్రామ్ జ్యోతి పథకంలో మీ మీ నియోజకవర్గాల్లో ఎన్ని గ్రామాల్లో విద్యుదీకరించారు? 2. ప్రభుత్వ పథకాలు.. వాటి ప్రయోజనాలు.. ఫలితాలతో పాటు సమగ్ర సమాచారాన్ని అందించే ప్రధాని మొబైల్ యాప్ ను ఎంతమంది డౌన్ లోడ్ చేసుకున్నారు?

ఈ రెండు ప్రశ్నలకు సమావేశానికి హాజరైన ఎంపీల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా సమాధానం చెప్పలేదట. కామ్ గా ఉన్న పరిస్థితిని అర్థం చేసుకున్న కేంద్రమంత్రి రాజ్ నాధ్ సింగ్.. ఆ నిశ్శబ్దాన్ని బద్ధలు కొట్టి.. ఎలా ముందుకు వెళ్లాలన్న విషయం మీద మాట్లాడి.. ఇబ్బందికర పరిస్థితిని సెట్ చేశారట. రాజ్ నాధ్ సింగ్ కానీ కల్పించుకోకపోతే తమ పరిస్థితి ఇబ్బందికరంగా ఉండేదని పేర్కొంటూ.. ఆయనకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నారట.