Begin typing your search above and press return to search.

స‌త్య నాదెళ్ల ఎందుకిలా మాట్లాడారు?

By:  Tupaki Desk   |   12 May 2017 10:00 AM GMT
స‌త్య నాదెళ్ల ఎందుకిలా మాట్లాడారు?
X
మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్య నాదెళ్ల వ్యాఖ్య‌లు టెక్ ప్ర‌పంచంలో ఆస‌క్త‌క‌రంగా మారుతున్నాయి. మైక్రోసాఫ్ట్‌ వార్షిక డెవలపర్స్ సదస్సు ‘ మైక్రోసాఫ్ట్ బిల్డ్ 2017’లో సత్యనాదెళ్ల మాట్లాడుతూ బహుళ జాతి సంస్థలు (ఎంఎన్‌ సీలు) `స్థానికులకు` వెన్నుదన్నుగా నిలిచి వారికోసం ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. వారికోసం కొత్త వ్యాపారాలను సృష్టించడం వల్ల దీర్ఘకాలంలో వృద్ధికి ఎలాంటి ఢోకా ఉండదని, అదే సమయంలో అగ్రరాజ్యాల రాజకీయ నేతలు లేవనెత్తుతున్న జాతీయత అంశాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని కూడా ఆయన అభిప్రాయ పడ్డారు. ‘అంతర్జాతీయంగా ఏ కంపెనీ అయినా స్థానికులకు అవకాశాలు కల్పించకుండా కేవలం లాభార్జనే లక్ష్యంగా పెట్టుకుంటే ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు’ అని స‌త్య తేల్చిచెప్పారు.

‘ఒక చోట దుకాణాన్ని ప్రారంభించి అక్కడి వారికి తిరిగి ఏమీ ఇవ్వకపోతే లాభం ఉండదు. స్థానికులకు అవకాశాలను సృష్టించాలి’ అని ఈ మూడు రోజుల సమావేశంలో ప్రారంభోత్స‌వ ప్ర‌సంగం చేశారు. ఒక కంపెనీ దీర్ఘకాలంగా వృద్ధిని నమోదు చేయాలంటే స్థానికులకు ప్రాధాన్యత ఇచ్చి తీరాల్సిందేనని భారతీయ సంతతికి చెందిన 49 ఏళ్ల సత్య నాదెళ్ల నొక్కి చెప్పారు. ఏ కంపెనీ దీర్ఘకాలిక వృద్ధికయినా ఇది చాలా ముఖ్యమని ఆయన అన్నారు. ప్రపంచ దేశాధినేతలు లేవనెత్తుతూ జాతీయత, దశాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్న పాత ప్రపంచీకరణ ధోరణుల సవాళ్లను ఎదుర్కోవడానికి ఇది దోహదపడుతుందని ఆయన అన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ‘అమెరికా ఫస్ట్’ విధానాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ‘ప్రతి దేశాధినేత ఆలోచించేది మొదట తన దేశం గురించే.. అమెరికాలో ఉండే వారు ఆలోచించేది మొదట అమెరికా గురించే. బ్రిటన్‌ లో ఉండే వారయితే మొదట బ్రిటన్ గురించే ఆలోచిస్తారు’ అని సత్య నాదెళ్ల అన్నారు. బహుళ జాతి కంపెనీలు తాము సంస్థను ప్రారంభించిన దేశానికి ఏమి ఇచ్చామనేది చాలా స్పష్టంగా చూపాలని కూడా సత్య నాదెళ్ల అన్నారు. అమెరికా విదేశాంగ విధానంలో దేశీయ ప్రయోజనాలు, దేశ భద్రతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని ట్రంప్ మొదటినుంచీ చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గత ఏప్రిల్‌లో ఆయన జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాల్లో సైతం అమెరికాకు తొలి ప్రాధాన్యత ఇవ్వడం చాలా స్పష్టంగా కనిపించింది. కాగా, అంతర్జాతీయంగా టెక్నాలజీ పరంగా ప్రధానంగా మార్పులు వస్తున్నాయని అంతకు ముందు సత్య నాదెళ్ల అన్నారు. మరోమాటలో చెప్పాలంటే వినియోగదారుల అనుభవం కేవలం ఒక మొబైల్ లేక ఒక యాప్‌ కో పరిమితంకావడం లేదని, అన్ని పరికరాలకు అది విస్తరిస్తోందని ఆయన అన్నారు. వైద్యం - వ్యవసాయం - డిజిటల్ మీడియా - పారిశ్రామిక ఇంటర్నెట్.. ఇలా ఏ రంగాన్ని చూసినా సరే టెక్నాలజీ డెవలపర్స్ ప్రభావం చాలా విస్తృతంగా కనిపిస్తోందని ఆయన అంటూ, అయితే ఈ విస్తృత అవకాశాలతో పాటుగా ఎంతో బాధ్యత కూడా ఉంటుందని స‌త్య నాదెళ్ల తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/