Begin typing your search above and press return to search.

ఏపీలో బోణీ చేసిన బీజేపీ... ఎమ్మెల్సీ మాధవ్‌ తో మొదలు

By:  Tupaki Desk   |   18 Jun 2019 12:37 PM GMT
ఏపీలో బోణీ చేసిన బీజేపీ... ఎమ్మెల్సీ మాధవ్‌ తో మొదలు
X
ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీకి వంగివంగి సలాంలు కొడుతుండడం... రాంమాధవ్ వంటి బీజేపీ జాతీయ స్థాయి నేతలు కూడా 2024కి ఏపీ తమ టార్గెట్లో లేదని చెబుతుండడంతో వైసీపీకి ఈ అయిదేళ్లు నల్లేరు మీద నడకే అని అంతా అనుకుంటున్నారు. ముఖ్యంగా బీజేపీ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. జగన్ ప్రశాంతంగా ఉండవని భావిస్తున్నారు. బీజేపీ ఏ రాష్ట్రాన్నైనా టార్గెట్ చేస్తే ఏమవుతుందో త్రిపురు- సిక్కిం- అస్సాం- బెంగాల్ వంటి చోట్ల తెలియడంతో జగన్ బీజేపీతో జాగ్రత్తగానే ఉంటున్నారు. అటు బీజేపీ కూడా జగన్ జోలికి రామన్నట్లుగాకనిపించింది. కానీ.. చూడబోతే ఆ పరిస్థితులు కొనసాగేలా లేవు. మెల్లమెల్లగా వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ప్రత్యక్షంగా దాడి మొదలుపెడుతోంది.

జగన్ సీఎం అయ్యాక విష్ణుకుమార్ రాజు- విష్ణువర్ధన్ రెడ్డి- కృష్ణంరాజు వంటి ఆ పార్టీ నేతలు ప్రశంసలు కురిపించారు. కానీ.. తొలిసారి బీజేపీ నేత ఒకరు జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అవును... బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తాజాగా విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ... ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఈ ప్రభుత్వమూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని విమర్శించారు. ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా కనుక ఇవ్వాలనుకుంటే ముందుగా ఏపీకే ఇవ్వాలని కేందాన్ని కోరతామని అన్నారు. ప్రత్యేక హోదాకు, పారిశ్రామిక రాయితీలు రావడానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు.

అంతేకాదు... కేసీఆర్, జగన్ మధ్య స్నేహంపైనా ఆయన పరోక్షంగా హెచ్చరికలు చేశారు. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఈ ప్రాజెక్టుపై తమకు చాలా అనుమానాలు ఉన్నాయని అన్నారు. తమ అనుమానాలు తీర్చిన తర్వాతే ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి జగన్ వెళ్లాలని డిమాండ్ చేశారు. నికరజలాలు లేకుండా నిర్మించే కాళేశ్వరం ప్రాజెక్టుపై జగన్ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.