Begin typing your search above and press return to search.

పట్టభద్రులు పోటెత్తారు.. రికార్డు స్థాయిలో పోలింగ్

By:  Tupaki Desk   |   15 March 2021 2:39 AM GMT
పట్టభద్రులు పోటెత్తారు.. రికార్డు స్థాయిలో పోలింగ్
X
ఇప్పటివరకు ఎప్పుడు లేనంత ఎక్కువగా.. మండే ఎండను లెక్క చేయకుండా.. పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ వేళ.. ఓటర్లు భారీగా పోటెత్తారు. మిగిలిన ఎన్నికలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు రెండు పెద్ద తేడాలు ఉన్నాయి. అదేమంటే.. సాధారణ ఓటర్లకు ఈ ఎన్నికల్లో ఓటువేసే అవకాశం ఇవ్వరు. కనీసం డిగ్రీ పూర్తి చేసిన వారు ప్రత్యేకంగా ఓటర్ గా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో మరో ఆసక్తికర అంశం ఏమంటే.. బరిలో ఉన్న అందరుఅభ్యర్థులకు ఓటు వేయొచ్చు. కాకుంటే.. పోలింగ్ కేంద్రంలో సిబ్బంది ఇచ్చిన పెన్నుతో.. తమకుతోచిన క్రమంలో ప్రాధాన్యతను తెలుపుతూ ఓటు వేసే వీలుంది.

గడిచిన రెండు దఫాలుగా చూస్తే.. ఈ ఎన్నికల పోలింగ్ 30 శాతానికి మించదు. అలాంటిది ఈసారి రెట్టింపు పోలింగ్ నమోదు కావటం గమనార్హం. తెలంగాణలోని పది పాత జిల్లాల ప్రాతిపదికన చూస్తే.. ఆరు జిల్లాల్లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ భారీగా నమోదైంది. రెండు స్థానాలకు కలిపి సరాసరి చూస్తే.. 70.61 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఏ స్థానానికి ఆ స్థానాన్ని లెక్కలోకి తీసుకుంటే.. హైదరాబాద్,రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ లో 64.87 శాతం నమోదు కాగా.. వరంగల్, ఖమ్మం, నల్గొండలో జరిగిన పోలింగ్ ఏకంగా 76.35 శాతం నమోదు కావటం విశేషం.

గతం కంటే దాదాపు 25 శాతం పోలింగ్ పెరిగింది. గంటల కొద్దీ క్యూలైన్ లో వేచి ఉన్న ఓటర్లు ఓపిగ్గా ఓటేశారు. ఎన్నిక ఏదైనా సరే.. ఓటు వేసేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపని హైదరాబాద్ మహానగర ఓటర్లు.. తమ తీరుకు భిన్నంగా ఈసారి మాత్రం పెద్ద ఎత్తున ఓటేశారు. దాదాపు 63 శాతానికి పైనే పోలింగ్ నమోదైన తీరు చూస్తే.. పార్టీలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. ఈ పోలింగ్ ఫలితాలు ఈ నెల 17న అంటే.. బుధవారం వెలువడనున్నాయి. మిగిలిన ఎన్నికల మాదిరి కాకుండా.. ప్రాధామ్యాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు ఉండటంతో.. బుధవారం రాత్రి కి కానీ.. గురువారానికి కానీ ఫలితం వెల్లడయ్యే వీలుందని అంచనా వేస్తున్నారు.