Begin typing your search above and press return to search.

ప్రచారం ముగిసిన వేళలో కేటీఆర్ ఏం చేశారు?

By:  Tupaki Desk   |   13 March 2021 8:30 AM GMT
ప్రచారం ముగిసిన వేళలో కేటీఆర్ ఏం చేశారు?
X
తెలంగాణలో జరుగుతున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. పోటాపోటీగా సాగుతున్న ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నా.. అలాంటి పరిస్థితి ఏమీ లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. పోటాపోటీగా ఉండటమే కాదు.. ఎవరు గెలుస్తారన్న విషయంపై స్పష్టత రావట్లేదని చెబుతున్నారు.

పోటాపోటీగా ఎన్నికల వ్యూహాన్ని అమలు చేసిన రాజకీయ పార్టీలు.. ప్రచార గడువు ముగిసే వరకూ ప్రచారం చేస్తూనే ఉన్నాయి. ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి. ఓటర్ల మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నంతోపాటు.. ప్రచారం తీరు తెన్నులు.. కీలక పోలింగ్ కు ముందుగా చేపట్టాల్సిన జాగ్రత్తలతో సహా.. సాధారణ ఎన్నికలకు మించిన ప్లానింగ్ నడుస్తోంది.

ఇదిలా ఉంటే.. శుక్రవారం సాయంత్రం ప్రచార గడువు ముగిసే సమయంలోనూ మంత్రి కేటీఆర్ బిజీబిజీగా ఉన్నారు. మంత్రులు.. ఎమ్మెల్యేలతో పాటు ముఖ్యనేతలందరితోనూ ఫోన్లో మాట్లాడుతూ బిజీబిజీగా గడిపారు. ఎక్కడేం జరుగుతుందన్న విషయాల్ని అడిగి తెలుసుకోవటంతో పాటు.. తన వరకు వచ్చిన విషయాల్ని నేతలకు చెబుతూ ఫాలో అప్ చేస్తున్నారు. ప్రచార గడువుపూర్తయ్యే చివరి క్షణం వరకు కేటీఆర్ ఇదే పనిలో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.తమకు అచ్చిరాని హైదరాబాద్.. రంగారెడ్డి.. మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో సొంతం చేసుకోవాలన్నట్లుగా మంత్రి కేటీఆర్ తీరు ఉందని చెప్పక తప్పదు. మరి.. ఆయన కష్టానికి ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.