Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో మ‌రో పోరు..పంచాయ‌తీ కాదు!

By:  Tupaki Desk   |   11 Jan 2019 4:29 AM GMT
తెలంగాణ‌లో మ‌రో పోరు..పంచాయ‌తీ కాదు!
X
తెలంగాణలో మ‌రో ఎన్నిక‌ల పోరు సాగ‌నుంది. ఇటీవ‌లే ముగిసిన ఎన్నిక‌లు త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు మ‌ధ్య మ‌రో ఎన్నిక జ‌ర‌గ‌నుంది. వచ్చే ఫిబ్ర‌వ‌రీ నెల మూడోవారంలో ఎమ్మెల్సీ ఎన్నికల నగరా మోగనుంది. ఇందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంద‌ని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. ఇప్పటికే ఖాళీ అయిన, త్వరలో ఖాళీ కాబోతున్న స్థానాలకు ఏకకాలంలో ఎన్నిక నిర్వహించాలని ఈసీ భావిస్తున్నట్టు సమాచారం.

తెలంగాణ శాసనమండలిలో మొత్తం 40 స్థానాలు ఉండగా - ప్రతి రెండేళ్ల‌కోసారి మూడోవంతు స్థానాలు ఖాళీ అవుతాయి. కేంద్ర ఎన్నికల సంఘం వాటికి ఎన్నికలు నిర్వహించి ఆయా స్థానాలను భర్తీ చేస్తుంది. మార్చి 29నాటికి ఎనిమిది - మే 1నాటికి ఒక ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మైనంపల్లి హన్మంతరావు - పట్నం నరేందర్‌ రెడ్డి - కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. వరంగల్‌ స్థానిక సంస్థల ద్వారా ఎమ్మెల్సీగా గెలిచిన కొండా మురళీధర్‌ రావు టీఆర్‌ ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ లో చేరి పదవికి రాజీనామా చేశారు. అంటే మొత్తం 13 ఎమ్మెల్సీ స్థానాలు మండలిలో ఖాళీగా ఉండబోతున్న నేపథ్యంలో భర్తీ చేసే ప్రక్రియను ఈసీ వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి మూడోవారంలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసి మార్చి రెండోవారం నాటికి ప్రక్రియను ముగించాలని భావిస్తోంది. ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తయ్యే పదిరోజుల ముందుగానే కొత్త ఎమ్మెల్సీల ఎంపిక ప్రక్రియ కూడా ముగుస్తుంది. మరోవైపు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచారి మండలిలో ఖాళీ అయ్యే వివరాలను - ఇప్పటికే పలు కారణాల వల్ల ఖాళీ అయిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేశారు. 13 స్థానాల ఎన్నిక విషయంలో ఇప్పటికే స్పష్టత వచ్చినప్పటికీ మరో మూడు స్థానాల్లో మాత్రం స్పష్టతరాలేదు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్‌ ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ లో చేరిన రాములు నాయక్‌ - ఆర్‌ భూపతిరెడ్డి - కే యాదవరెడ్డి సభ్యత్వాలను రద్దు చేయాలని టీఆర్‌ ఎస్‌ ఇటీవల శాసన మండలి చైర్మన్‌ కు ఫిర్యాదు చేసింది. మండలి చైర్మన్‌ ఈ విషయంపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఫిరాయింపుల చట్టం నిబంధనల ప్రకారం ఈ ముగ్గురు ఎమ్మెల్సీలపై చైర్మన్‌ చర్యలు తీసుకుంటే మరో మూడుస్థానాలు ఖాళీ అవుతాయి. దీంతో ఇప్పటికే ఉన్న 13 స్థానాలకు ఈ మూడుస్థానాలు కలుపుతే మొత్తం 16 స్థానాలు ఖాళీ అవుతాయన్నమాట. ఒకవేళ ఇదే జరిగితే మొత్తం 16 ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నది.

పదవీకాలం ముగిసే ఎమ్మెల్సీలు

ఎమ్మెల్యే కోటాలో: షబ్బీర్‌ అలీ - పొంగులేటి సుధాకర్‌ రెడ్డి - టీ సంతోష్‌ కుమార్‌ - మహమూద్‌ అలీ - మహ్మద్‌ సలీం
ఉపాధ్యాయుల కోటాలో: పాతూరి సుధాకర్‌ రెడ్డి - పూల రవీందర్‌
పట్టభద్రుల కోటాలో: స్వామిగౌడ్‌
హైదరాబాద్‌ స్థానిక సంస్థల ద్వారా: ఎంఎస్‌ ప్రభాకర్‌ రావు
ఉప ఎన్నిక జరిగే స్థానాలు
నల్లగొండ స్థానిక సంస్థల నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి
రంగారెడ్డి స్థానిక సంస్థల నుంచి పట్నం నరేందర్‌ రెడ్డి
వరంగల్‌ స్థానిక సంస్థల నుంచి కొండా మురళీధర్‌ రావు
ఎమ్మెల్యే కోటాలో మైనంపల్లి హన్మంతరావు
పార్టీ ఫిరాయింపు ఫిర్యాదు ఎదుర్కొంటున్నవారు
గవర్నర్‌ కోటా రాములునాయక్‌
నిజామాబాద్‌ స్థానిక సంస్థల నుంచి ఆర్‌ భూపతిరెడ్డి
ఎమ్మెల్యే కోటాలో కే యాదవరెడ్డి