Begin typing your search above and press return to search.

ఏపీలో మ‌రో భారీ ఎన్నిక‌ల పోరు

By:  Tupaki Desk   |   7 Jan 2017 7:36 AM GMT
ఏపీలో మ‌రో భారీ ఎన్నిక‌ల పోరు
X
నవ్యాంధ్రప్ర‌దేశ్‌ లో మ‌రో భారీ ఎన్నిక‌ల పోరుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. 22 మంది ఎమ్మెల్సీల ప‌ద‌వీకాలం ముగుస్తున్న నేప‌థ్యంలో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ కూడా తమ అభ్యర్ధులకు రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. శాసనమండలి సభ్యుల పదవీకాలం ఆరేళ్లు. ప్రతి రెండేళ్లకూ మూడో వంతు మంది ఎమ్మెల్సీలు రిటైర్‌ అయ్యే విధానం శాసనమండలిలో కొనసాగుతోంది. ఈసారి మొత్తం ఐదు విభాగాలకు చెందిన ఎమ్మెల్సీలు రిటైరవుతున్నారు. ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికైన వారిలో ఏడుగురు - స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన వారిలో 8 మంది - పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి ఎన్నికైన వారి లో ముగ్గురు - ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన వారిలో ఇద్దరు - గవర్నర్‌ నామినేట్‌ చేసిన వారిలో ఇద్దరు మొత్తం 22 మంది రిటైర్‌ అవుతున్నారు. మార్చి నుంచి మే నెల మధ్యలో వీరి పదవీ కాలం ముగుస్తోంది. శాసనమండలి చైర్మన్‌ చక్రపాణి కూడా ఈసారి రిటైరవుతున్న వారిలో ఉన్నారు.

ఈ ప‌రిణామం అధికార తెలుగుదేశం పార్టీకి భారీగా క‌లిసి వ‌చ్చే అవకాశం ఉంద‌ని చెప్తున్నారు. ఖాళీ అవుతున్న స్థానాలకు ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నికలు జరుగుతాయని అసెంబ్లీ వర్గాలు పేర్కొన్నాయి. పట్టభద్ర - ఉపాధ్యాయ స్థానాలకు మార్చిలో ఎన్నికలు జరపనున్నట్లు ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. మిగిలిన వాటికి ఎన్నికల తేదీలు ప్రకటించాల్సి ఉంది. ఈ సీట్లకు ఎన్నికలతో శాసనమండలిలో టీడీపీ బలం ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటా కింద ఎన్నిక జరగాల్సి ఉన్న 7 స్థానాల్లో 6 టీడీపీకి దక్కే అవకాశముందని అంటున్నారు. వైసీపీకి ఒక ఎమ్మెల్సీ మాత్రమే వచ్చే సూచనలు ఉన్నాయి. స్థానిక సంస్థల కోటా కింద ఎన్నికలు జరగాల్సిన 8 సీట్లలో రెండు చోట్ల (కడప - నెల్లూరు) మాత్రమే అధికార పక్షం - ప్రతిపక్షాల మధ్య గట్టి పోటీ నెలకొంది. పట్టభద్రులు - ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో వామ పక్షాలు బలపరుస్తున్న అభ్యర్థులకు - టీడీపీ బలపరుస్తున్న అభ్యర్థులకు మధ్య పోటీ నెలకొంది.

రిటైరవుతున్న ఎమ్మెల్సీల జాబితాలో ఎమ్మెల్యే కోటా నుంచి బి. చెంగల్రాయుడు - మహ్మద్‌ జానీ - సింగారెడ్డి వెంకట సతీష్‌ కుమార్‌ రెడ్డి - కావలి ప్రతిభా భారతి - పీజే చంద్రశేఖరరావు - సి. రామచందయ్య్ర - ఎం. సుధాకర్‌ బాబు రిటైరవుతున్నారు. స్థానిక సంస్థల కోటా నుంచి మెట్టు గోవింద రెడ్డి (అనంతపురం) - చడిపిరాళ్ల నారాయణరెడ్డి(కడప) - బొడ్డు భాస్కర రామారావు (తూర్పుగోదావరి) - అంగర రామ్మోహన్‌ (పశ్చిమగోదావరి) - మేకా శేషు బాబు(పశ్చిమగోదావరి) - పీరుకట్ల విశ్వ ప్రసాదరావు(శ్రీకాకుళం) - వాకిటి నారాయణరెడ్డి(నెల్లూరు) - బి. నరేష్‌ కుమార్‌ రెడ్డి (చిత్తూరు) రిటైరవుతున్నారు. పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి ఎంవీఎస్‌ శర్మ(ఉత్తరాంధ్ర) - యండపల్లి శ్రీనివాసుల రెడ్డి(పక్రాశం - నెల్లూరు - చిత్తూరు) - డాక్టర్‌ ఎం. గేయానంద్‌(సీమ) - ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి విటాపు బాలసుబ్రమణ్యం (ప్రకాశం - నెల్లూరు - చిత్తూరు) - బచ్చల పుల్లయ్య(రాయలసీమ) - గవర్నర్‌ నామినేటెడ్‌ కోటా నుంచి డాక్టర్‌ ఎ. చక్రపాణి - ఆర్‌. రెడ్డపరెడ్డి రిటైరవుతున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/