Begin typing your search above and press return to search.

మాజీ డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత్ బాబు అరెస్ట్

By:  Tupaki Desk   |   23 May 2022 5:25 AM GMT
మాజీ డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత్ బాబు అరెస్ట్
X
తన మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ (అనంత బాబు) ను తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పోలీసులు అరెస్టు చేశారు. గత రెండు రోజుల నుంచి తప్పించుకు తిరుగుతున్న అనంత్ బాబుని ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ హత్య కేసులో ఆయనపై పోలీసులు హత్య కేసుతో పాటు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది.

మే 22 ఆదివారం అర్ధరాత్రి ఎమ్మెల్సీని తమ అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను కాకినాడలోని ఏఆర్ పోలీసు క్వార్టర్స్ లో ఉంచారు. అనంత్ బాబుతో పాటు ఆయన అనుచరులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ లో సుబ్రమణ్యంను తామే కొట్టి చంపినట్టు ఎమ్మెల్సీ తోపాటు ఆయన అనుచరులు అంగీకరించారు. పోస్టుమార్టం నివేదికలోనూ ఇదే విషయం వెల్లడైంది. దీనిపై డీఐజీ పాలరాజు మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

కాగా మృతుడు సుబ్రమణ్యం కుటుంబంతో అన్ని రాజీ ప్రయత్నాలకు ఎమ్మెల్సీ అనంత్ ప్రయత్నించారు. సుబ్రమణ్యం కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, అతడి తమ్ముడికి ఔట్ సోర్సింగ్ జాబ్, ఐదెకరాల పొలం, 8.5 లక్షల నగదు అందిస్తామని హామీ ఇచ్చారు. అయినా మృతుడి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో వైఎస్సార్సీపీ తరపున పెద్దలు మృతుడి కుటుంబ సభ్యులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు.. బెదిరింపులకు దిగారు. అయినా వారు లొంగలేదు.

గొల్లల మామిడాడకు చెందిన సుబ్రహ్మణ్యం గతంలో అనంత ఉదయ భాస్కర్‌ వద్ద డ్రైవర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆయన దగ్గర సుబ్రహ్మణ్యం రూ.70 వేలు అప్పుగా తీసుకున్నారు. ఇందులో రూ.50 వేలు ఇచ్చేశామని మృతుడి తండ్రి నూకరత్నం చెబుతున్నారు. ఇంకా రూ.20 వేలు ఎమ్మెల్సీకి ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ఈ రూ.20 వేలు విషయంలో పలుమార్లు ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ తన కుమారుడు సుబ్రహ్మణ్యంకు ఫోన్‌ చేసి బెదిరించారని ఆరోపిస్తున్నారు.

మరోవైపు మృతుడి భార్య అపర్ణ కూడా ఇదే చెబుతోంది. సుబ్రహ్మణ్యం అపర్ణను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె నాలుగు నెలల గర్భవతి. దీంతో తనను చూసుకోవడానికి తన భర్త ఎమ్మెల్సీ వద్ద డ్రైవర్‌గా పనిచేశాడని అపర్ణ చెబుతోంది. గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో సుబ్రహ్మణ్యం కాకినాడలోని కొండయ్యపాలెంలో స్నేహితులతో కలసి ఉన్నాడు. ఆ సమయంలో అనంత ఉదయ్‌ భాస్కర్‌ కారులో అక్కడికి వచ్చి తన భర్తను తనతో ఎక్కించుకు తీసుకువెళ్లారని అపర్ణ చెబుతోంది. ఎమ్మెల్సీ ఉదయభాస్కర్‌ వివాహేతర సంబంధాలు, రహస్యాల గురించి తన భర్తకు తెలుసనే ఆయనను హత్య చేశారని ఆరోపిస్తోంది. 10.30కు తన భర్తను తీసుకెళ్లి తిరిగి రాత్రి 12.30 గంటల సమయంలో యాక్సిడెంట్‌లో సుబ్రహ్మణ్యం మరణించాడని తమకు ఫోన్‌ చేసి ఎమ్మెల్సీ చెప్పారని చెబుతోంది.

అయితే.. ఎమ్మెల్సీ ప్రమాదం జరిగిందని చెబుతున్న నాగమల్లితోట దగ్గర ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదంలో చనిపోతే మృతదేహమంతా నీరు కారుతూ.. సముద్రపు ఇసుకతో ఎలా ఉంటుందని మృతుడి తల్లిదండ్రులు నిలదీసిన సంగతి తెలిసిందే. సుబ్రహ్మణ్యం పెదవి పగిలిపోయి ఉందని.. వీపు, మెడ, మోకాలు, తదితర శరీర భాగాల్లో చీరుకుపోయిన గాయాలు ఉన్నాయని.. రెండు చేతులు విరిగిపోయాయని బోరుమంటున్నారు.

ప్రమాదం జరిగితే పోలీసులకు ఫోన్‌ చేయాలని.. లేదా ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఇవేమీ చేయకుండా కారులో శుక్రవారం తెల్లవారుజామున శవాన్ని తెచ్చారని ఆరోపించిన విషయం విదితమే. శవాన్ని వెంటనే తీసుకోవాలంటూ తమపై ఒత్తిడి తెచ్చారని.. గద్దించారని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పైగా తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటే చేయొద్దన్నారని.. వెంటనే అంత్యక్రియలు చేయించమని పట్టుబట్టారని చెబుతున్నారు.

మరోవైపు ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌ భాస్కర్‌ డ్రైవర్‌ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాక మాయమైపోయారు. ఆయన ఎక్కడుందీ ఎవరికీ తెలియ లేదు. ఎమ్మెల్సీని అరెస్టు చేసేవరకు పోస్టుమార్టం చేయడానికి అంగీకరించబోమని కుటుంబ సభ్యులు, ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. ఎమ్మెల్సీ పై హత్య కేసు నమోదు చేశాక పోస్టుమార్టం చేయడానికి ఒప్పుకున్నారు.

మరోవైపు మృతుడు సుబ్రహ్మణ్యం దళితుడు కావడంతో దళిత సంఘాలు, ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు మృతుడి కుటుంబానికి అండగా నిలిచాయి. ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్‌ను అరెస్టు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశాయి. మరోవైపు ఈ వ్యవహారం అధికార వైఎస్సార్‌సీపీకి తలకు రోకలిపోటులా మారింది. దీంతో ఎమ్మెల్సీని అరెస్ట్ చేయక తప్పలేదు.