Begin typing your search above and press return to search.

స్ట్రెచర్ మీద వచ్చి ఓటేసిన ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   19 Jun 2020 5:46 AM GMT
స్ట్రెచర్ మీద వచ్చి ఓటేసిన ఎమ్మెల్యే
X
దేశ వ్యాప్తంగా పది రాష్ట్రాల్లో రాజ్య సభ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మిగిలిన ఎన్నికలకు రాజ్యసభ ఎన్నికలకు తేడా ఏమంటే.. ప్రతి ఒక్క ఓటు కీలకమైనదే. ఒక్క ఓటు తేడా వచ్చినా ఫలితం తేడా వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే.. చాలా లెక్క ప్రకారం ఓట్ల సర్దుబాటు చేస్తుంటారు. తాజాగా గుజరాత్ లో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

బీజేపీ ఎమ్మెల్యే కేసరినాథ్ జెసంగ్ భాయ్ సోలంకి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు పూర్తిగా నయం కాలేదు. రాజ్యసభ ఎన్నికల పోలింగ్ కావటంతో ఆయన తప్పనిసరిగా ఓటు వేయాల్సిన పరిస్థితి. దీంతో.. ఈ ఉదయం ఆయన్ను అంబులెన్సులో ఆసుపత్రి నుంచి అసెంబ్లీకి తీసుకొచ్చారు. స్ట్రెచర్ మీదే పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లారు.

ఓటు వేసిన అనంతరం ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లనున్నారు. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి. సోలంకి ప్రస్తుతం మతార్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తం పది రాష్ట్రాల్లో 24 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్.. గుజరాత్.. కర్ణాటక రాష్ట్రాల్లో నాలుగేసి చొప్పున.. మధ్యప్రదేశ్.. రాజస్థాన్ లలో మూడేసి స్థానాలకు.. జార్ఖండ్ నుంచి రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ.. మణిపూర్.. అరుణాచల్ ప్రదేశ్. మిజోరం రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఫలితాలు ఈ సాయంత్రానికే విడుదల కానున్నాయి. పోలింగ్ ముగిసిన రెండు గంటల వ్యవధిలోనే ఫలితాల్ని వెల్లడించనున్నారు.