Begin typing your search above and press return to search.

బ్యాంకు టోపీ పెట్టిన వజ్రాల వ్యాపారి గాయిబ్

By:  Tupaki Desk   |   25 May 2021 5:30 AM GMT
బ్యాంకు టోపీ పెట్టిన వజ్రాల వ్యాపారి గాయిబ్
X
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం గురించి తెలిసిందే. వేలాది కోట్ల రూపాయిల్ని అక్రమ పద్దతిలో తరలించి.. తర్వాత గుట్టుచప్పుడు కాకుండా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన ఉదంతం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ ఉదంతంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో నీరవ్ మోదీతో పాటు.. వజ్రాల వ్యాపారి మెహల్ చోక్సీ కూడా మరొకరు. ఇండియా నుంచి తప్పించుకొని అంటిగ్వా దీవిలో తలదాచుకుంటున్నాడు.

2017లో అంటిగ్వా.. బార్చుడా పౌరసత్వం తీసుకోవటం.. అతడ్ని భారత్ కు తీసుకురావటం కష్ట సాధ్యమన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా అతడి మిస్సింగ్ వ్యవహారం సంచలనంగా మారింది. అంటిగ్వా దీవిలోని ఒక రెస్టారెంట్ లో పార్టీ కోసం వెళ్లిన అతడు కాస్తా మిస్ అయినట్లుగా గుర్తించారు. ఈ విషయాన్ని అతడి న్యాయవాది విజయ్ అగర్వాల్ వెల్లడించారు.

పార్టీ కోసం వెళ్లిన చోక్సీ కనిపించకుండా పోయాడని.. అతడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లుగా చెప్పారు. అతడి కారును రెస్టారెంట్ కు సమీపంలోని జాలీ హార్బర్ లో గుర్తించారు. చోక్సీ మిస్సింగ్ ఉదంతం బయటకు వచ్చిన వెంటనే అతడి కోసం అంటిగ్వా పోలీసులు రంగంలోకి దిగారు. అతడ్ని గుర్తించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చోక్సీ మిస్సింగ్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.