Begin typing your search above and press return to search.

ఆ చిట్టితల్లి ఎంత నరకం అనుభవించిందో

By:  Tupaki Desk   |   8 Dec 2015 6:40 AM GMT
ఆ చిట్టితల్లి ఎంత నరకం అనుభవించిందో
X
చట్టాలు ఎన్ని వచ్చినా దారుణాలు ఆగటం లేదు. చిన్నా పెద్దా.. వాయి వరస లేకుండా.. జంతువుల మాదిరి కామంతో ఊగిపోతున్న మృగాళ్ల కారణంగా ఎందరో చిట్టితల్లులు బలైపోతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ శివారులో చోటు చేసుకున్న ఈ దారుణాన్ని వింటే.. ఒళ్లు జలదరించక మానదు. నిర్భయ ఉదంతాన్ని తలపించేలా ఉందీ ఘటన.

ముగ్గురు దుండగులు.. 15 ఏళ్లున్న ఒక మైనర్ బాలికను కిడ్నాప్ చేశారు. దారుణమైన విషయం ఏమిటంటే.. కిడ్నాప్ చేసిన ముగ్గురిలో ఇద్దరు మైనర్లు కావటమే. ఇలా తాము కిడ్నాప్ చేసిన బాలికను నొయిడాలోని ఒక గ్రామం బయట ఉన్న ఫాంహౌజ్ లో బంధించారు. 15 రోజుల పాటుగా ఆమెపై అత్యాచారాలు చేస్తూనే ఉన్నారు. ఒక రాత్రి ఈ అమ్మాయి.. వారి చెర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది.

దీన్ని గుర్తించిన వారు ఆ అమ్మాయి మీద తుపాకితో కాల్పులు జరిపారు. అనంతరం ఆమె మరణించిందని భావించి ఒక బావిలో పడేశారు. అయితే.. ఆమె మరణించలేదు. సాయం కోసం కేకలు వేయటంతో అక్కడి గ్రామస్తులు ఆమెనుకాపాడి బైక్ మీద ఆసుపత్రికి చేర్చారు. ఛాతి.. పొత్తి కడుపులో బుల్లెట్లు దూసుకుపోయి.. రక్తం కారుతున్నా ఆమె బతికి ఉండటం వైద్యులకు సైతం విస్మయాన్ని కలిగిస్తోంది.

బుల్లెట్ల కారణంగా భారీగా రక్తస్రావం జరిగి.. ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. బాధితురాలి ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేదని.. అయితే ఆమె స్పృహలోనే ఉందంటున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో నిందితుల్ని పోలీసులు గుర్తించే పనిలో పడ్డారు. అయితే.. చట్టంలో ఉన్న లొసుగుల ప్రకారం.. ఇంత దారుణానికి పాల్పడిన వారిలో ఇద్దరు మైనర్లు కావాటంతో వారికి పెద్దగా శిక్షపడే అవకాశం లేదు. వయసులో చిన్న (చట్టం ప్రకారం) అయినా.. చేతల్లో నరరూప రాక్షసుల్ని తలపించేలాంటి ఈ కామపిశాచులకు ఎలాంటి శిక్ష విధిస్తే బాగుంటుందంటారు?