Begin typing your search above and press return to search.

ఆరాచకం: చనిపోయిన ఆ బాలిక కథ తెలిస్తే గుండె మండిపోద్ది

By:  Tupaki Desk   |   13 Aug 2020 3:30 AM GMT
ఆరాచకం: చనిపోయిన ఆ బాలిక కథ తెలిస్తే గుండె మండిపోద్ది
X
హైదరాబాద్ లో ఒక అనాథ బాలిక మరణించింది. ఇది మామూలు మరణం కాదు. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న వివరాలు తెలిసే కొద్దీ నోట మాట రానంత షాకింగ్ గా ఉన్నాయి. అభంశుభం తెలీని పద్నాలుగేళ్ల బాలికకు నిండు నూరేళ్లు నిండిపోవటానికి కారణం.. ఆమెకు రక్షగా ఉండాల్సిన అనాధ ఆశ్రమంలో.. ఒక దాత దాష్టీకానికి బలి కావటమే. పద్నాలుగేళ్ల బాలికకు నూరేళ్లు నిండిపోయిన ఈ ఉదంతం వివరాలు ఇలా ఉన్నాయి.

తల్లిదండ్రులు లేని ఈ పద్నాలుగేళ్ల బాలిక అమీన్ పూర్ లోని ఒక ప్రైవేటు అనాథ శరణాలయంలో ఉంటోంది. ఐదో తరగతి చదువుతున్న ఈ బాలిక లాక్ డౌన్ కారణంగా న్యూ బోయిన్ పల్లిలోని తన చిన్నమ్మ ఇంటికి వెళ్లింది. అనారోగ్యంగా ఉన్న ఆ బాలికను డాక్టర్ వద్దకు తీసుకెళ్లి చూపించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు చెప్పిన వైనంతో వారు షాక్ అయ్యారు.

ఈ చిన్నారి లైంగికదాడికి గురైందని పేర్కొన్నారు. బాలికను అడగ్గా.. ఆశ్రమానికి విరాళం ఇచ్చే దాత వచ్చినప్పుడు తనను ఐదో అంతస్తుకు పంపే వారని.. కూల్ డ్రింక్ తాగిన తర్వాత తనకేమీ తెలీదని.. మెలుకువ వచ్చాక చూసుకుంటే.. ఒంటి మీద బట్టలు ఉండేవి కావని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలు ఎవరికీ చెప్పొద్దంటూ వార్డెన్ బెదిరించేవారని ఆ పాప పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది.

ఆసుపత్రిలోకి చేర్చే నాటికే బాలిక పరిస్థితి విషమించటంతో.. ఆమెను నిలోఫర్ కు పంపారు. తీవ్రమైన అనారోగ్యంతో ఉండటంతో వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తుండగా మరణించింది. ఆమె మరణం వెనుక డ్రగ్స్ లాంటి వాటి ప్రభావం ఉందా? అన్న కోణంలో విచారిస్తున్నారు. అభంశుభం తెలీని అమ్మాయిపై లైంగికదాడికి కారణమైన అనాధ ఆశ్రమ నిర్వాహకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. తర్వాతేం జరిగినా.. ముందైతే.. ఒకరి లైంగిక వాంఛ కోసం ఒక చిన్నారి తన ప్రాణాల్ని కోల్పోవాల్సి వచ్చిందే అన్న మాట మనసును చేదుగా మార్చేయక మానదు.