Begin typing your search above and press return to search.

వైఎస్సార్సీపీ రెండో రోజు ప్లీన‌రీ.. జ‌గ‌న్ ను కీర్తిస్తూ చిందేసిన మంత్రి అప్ప‌ల‌రాజు

By:  Tupaki Desk   |   9 July 2022 9:30 AM GMT
వైఎస్సార్సీపీ రెండో రోజు ప్లీన‌రీ.. జ‌గ‌న్ ను కీర్తిస్తూ చిందేసిన మంత్రి అప్ప‌ల‌రాజు
X
వైఎస్సార్సీపీ పార్టీ ఏర్పాటు త‌ర్వాత జ‌రుగుతున్న మూడో ప్లీన‌రీ ఉత్సాహ‌భ‌రిత వాతావ‌ర‌ణంలో సాగుతోంది. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివ‌ర్సిటీ స‌మీపంలో విశాల ప్రాంగ‌ణంలో ఈ ప్లీన‌రీ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. కాగా మొద‌టి రోజు జూలై 8న జ‌రిగిన‌ట్టే రెండో రోజు ప్లీన‌రీ కూడా జ‌గ‌న్ పైన వైఎస్ఆర్సీపీ నేత‌లు, మంత్రుల పొగ‌డ్త‌లు, కీర్త‌న‌ల‌తోనే స‌రిపోయింద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

జూలై 9న రెండో రోజు ముగింపు రోజున వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వైఎస్సార్సీపీ సాంస్కృతిక కమిటీ కన్వీనర్‌ వంగపండు ఉష ఆధ్వర్యంలో 15 మంది కళాకారులు జానపద నృత్యాలు, గీతాలతో అలరించారు. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణ‌లు కూడా చిందేసి ఆనందించాయి.

నవరత్నాలు, సంక్షేమ పథకాలపై ప్రత్యేక బాణీలతో కూర్చిన గేయాలకు చిందేసి ఆడుతూ ప్లీనరీకి వచ్చిన కార్యకర్తల్లో వంగ‌పండు ఉష ఉత్సాహం నింపారు. ఇక‌ సినీనటుడు జోగినాయుడు (యాంక‌ర్ ఝాన్సీ మాజీ భర్త‌) సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. అయితే వీరికి దీటుగా మ‌త్స్య‌శాఖ మంత్రి తాను సైతం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ను కీర్తిస్తూ ఒక పాట అందుకున్నారు. ప‌ల్లె త‌ల్లి పాట పాడే ఉయ్యాల అంటూ అప్ప‌ల‌రాజు త‌న గాత్ర క‌చేరీని వినిపించారు.

ఓవైపు వంగ‌పండు ఉష‌, మ‌రోవైపు మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు, మ‌రోవైపు సినీ న‌టుడు జోగి నాయుడు పోటీలు ప‌డి మ‌రీ ముఖ్య‌మంత్రిపై కీర్త‌న‌లు అందుకున్నారు. దీంతో వైఎస్సార్సీపీ ప్లీన‌రీకి వ‌చ్చిన కార్య‌క‌ర్త‌లు ఉత్సాహంతో సంద‌డి చేశారు. ఉబ్బిత‌బ్బిబ్బయ్యారు.

ఏపీలో అధికార పార్టీ వైసీపీ ప్లీన‌రీ స‌మావేశాలు గుంటూరు జిల్లా ప‌రిధిలోని ఆచార్య నాగార్జున విశ్వ‌విద్యాల‌యం స‌మీపంలో శుక్ర‌వారం వేడుక‌గా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మావేశాల్లో భాగంగా పార్టీ శ్రేణుల‌ను ఉత్సాహ‌ప‌రిచేందుకు సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మాల్లో వంగ‌పండు ఉష హుషారెత్తించే ఉద్య‌మ గీతాల‌ను ఆల‌పించారు.

ఉష బృందంతో క‌లిసి మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు సంద‌డి చేశారు. భుజంపై గొంగ‌డి వేసుకుని ఉష‌తో క‌లిసి పాట పాడిన ఆయ‌న ఆమె బృందంతో క‌లిసి కాలు కూడా క‌దిపారు. ఈ స‌న్నివేశం పార్టీ శ్రేణుల‌ను ఆక‌ట్టుకుంది.