Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ ఒక్క‌టే ఒరిజిన‌ల్ బ్రీడ్‌.. అవ‌న్నీ క్రాస్ బీడ్‌లే

By:  Tupaki Desk   |   12 Dec 2021 4:30 AM GMT
టీఆర్ఎస్ ఒక్క‌టే ఒరిజిన‌ల్ బ్రీడ్‌.. అవ‌న్నీ క్రాస్ బీడ్‌లే
X
టీఆర్ఎస్ నాయ‌కుడు, రాష్ట్ర రోడ్డుర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్ ఎస్ ఒక్క‌టే ఒరిజినల్ బ్రీడ్ అని.. మిగిలిన పార్టీల‌న్నీ.. క్రాస్‌బీడ్‌ల‌తో పుట్టుకువ‌చ్చిన‌వేన‌ని చెప్పారు. ఎన్ని క్రాసింగ్లు జరిగినా.. క్రాస్ బ్రీడ్లు వచ్చినా.. త‌మ‌ విజయంతోనే సమాధానమిస్తామని మంత్రి పువ్వాడ తెలిపారు. తెలంగాణపై ఎఫ్‌సీఐ సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ ఎస్‌ విజయకేతనం ఎగురవేస్తోందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, నామ నాగేశ్వరరావు.. పలువురు ముఖ్యనేతలు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ తాతా మధు అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారని తెలిపారు. కేంద్ర రైతు వ్యతిరేక విధానాలను అవలభిస్తోందని తెరాస లోకసభాపక్ష నేత నామా నాగేశ్వ‌ర‌రావు ఆరోపించారు. ప్రజల హక్కులను హరించేలా కేంద్ర విధానాలు ఉంటున్నాయని తెలిపారు.

``రాష్ట్రంలో ఒకట్రెండు తప్పితే.. ఏ ఎన్నికలు పెట్టినా కూడా..టీఆర్ ఎస్‌ విజయం సాధిస్తుంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో నేతలు.. అధికార పార్టీ విజయమే లక్ష్యంగా కృషి చేస్తారు. ఇప్పడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాత మధు మంచి ఆధిక్యంతో విజయం సాధిస్తారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతు వ్యతిరేక విధానాలు. ప్రజల హక్కులను కాలరాసేలా కేంద్రం విధానాలను అవలభిస్తోంది. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను తెరాస వ్యతిరేకిస్తోంది. ధాన్యం సేకరణపై డిమాండ్ చేస్తే కేంద్రం పట్టించుకోవట్లేదు`` అని నామా వ్యాఖ్యానించారు.

ధాన్యం కొనుగోలు విషయంలో ఎఫ్సీఐ విధానం సరిగా లేదని మంత్రి పువ్వాడ అజయ్‌ ఆరోపించారు. తెలంగాణపై ఎఫ్‌సీఐ సవతి తల్లి ప్రేమ చూపిస్తోందన్నారు. సింగరేణిలోని బ్లాక్స్ వేలం వేయటాన్ని సింగరేణి తరఫున, తెరాస పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ ఎస్‌ గెలుపు ఖాయం. టీఆర్ ఎస్ విజయానికి పనిచేసిన అందరికి కృతజ్ఞతలు. భారీ మెజార్టీతో టీఆర్ ఎస్‌ విజయం సాధిస్తోంది. స్థానిక సంస్థలకు నిధులు కేటాయించిన సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తాతా మధుకి వచ్చే విజయం ద్వారా ప్రతిపక్షాలకు సమాధానం చెప్తాం. అలాంటి ఇలాంటి మెజార్టీ కాదు. భారీ మెజార్టీ సాధిస్తాం. ఏ క్రాసింగైనా.. క్రాస్ బ్రీడ్ అయినా వస్తుంటాయ్.. పోతుంటాయి. మాది అంతా ఒరిజినల్ బ్రీడ్. టీఆర్ ఎస్ అంటేనే ఒరిజినల్ బ్రీడ్. టీఆర్ ఎస్‌ విజయం పట్ల మాలో ఎలాంటి అభద్రతా భావం లేదు.. అని పువ్వాడ వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిపై ఇత‌ర పార్టీల నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి