Begin typing your search above and press return to search.

కేసీఆర్ మాటకు మించి చెప్పిన జగన్ మంత్రి.. అస్సలు బాగోలేదు

By:  Tupaki Desk   |   31 Aug 2021 2:48 PM GMT
కేసీఆర్ మాటకు మించి చెప్పిన జగన్ మంత్రి.. అస్సలు బాగోలేదు
X
అధినేత ఇమేజ్ ను చెడగొట్టే విషయంలో ఏపీ అధికారపక్ష నేతలు.. అధికారులు ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారా? అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న టీడీపీ నేత చింతమనేని విషయంలో పోలీసులు చేసిన పని.. ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఏ కేసులో.. ఎప్పుడు ఎలా వ్యవహరించాలన్న విషయాన్ని సాధారణంగా ఉన్నతాధికారుల విచక్షణకు వదిలిపెడుతుంది ప్రభుత్వం. అయితే.. కొందరు అధికారుల అత్యుత్సాహం ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే చింతమనేని ఎపిసోడ్ లో పోలీసులు తీరులో కనిపిస్తోంది.

ఇది ఒక కొలిక్కి రాక ముందే.. తాజాగా మంత్రి మేకపాటి గౌతంరెడ్డినోటి నుంచి వచ్చిన ఒక మాట జగన్ సర్కారు ఇమేజ్ కు డ్యామేజ్ గా మారుతుందన్న మాట వినిపిస్తోంది. గతంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్రటేరియట్ కు రాకుండా ప్రగతిభవన్.. ఫాంహౌస్ కు పరిమితమైన వైనంపై మీడియా ప్రశ్నలు వేసిన సందర్భంలో స్పందించిన కేసీఆర్.. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే సీఎంవో అంటూ వ్యాఖ్యానించారు. తాను సెక్రటేరియట్ వెళ్లకపోవటాన్ని సమర్థించుకున్నారు.

కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తటమే కాదు.. బాధ్యత కలిగిన మంత్రి నోటి నుంచి రావాల్సిన సమాధానం ఇది కాదన్న మాట పలువురి నోటి నుంచి వచ్చింది. కేసీఆర్ లాంటి అధినేత నోటి నుంచి వచ్చిన మాటే విమర్శల పాలైనప్పుడు.. ఆ మాటకు మించిన రీతిలో ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి చేసిన తాజా వ్యాఖ్య షాకింగ్ గా మారింది. అది కూడా.. అధినేతకు అపాదిస్తూ చెప్పే క్రమంలో జాగ్రత్తలు అవసరం. అలాంటివేమీ ఆలోచించకుండా చేసే వ్యాఖ్యలతో ప్రభుత్వానికి తలనొప్పి ఖాయం.

తాజాగా మంత్రి మేకపాటి చేసిన వ్యాఖ్యనే చూస్తే.. 'సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంటే..అదే రాజధాని అనుకోవాలి. అది పులివెందుల కావొచ్చు.. విజయవాడ కావచ్చు. రేపొద్దున మరో ప్రాంతమైనా కావొచ్చు' అంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నివాసం ఎక్కడ ఉంటే అక్కడే సెక్రటేరియట్.. అదే రాజధాని అన్న వ్యాఖ్యలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి. రాజధానిపై వ్యాఖ్యలు చేసే విషయంలో జాగ్రత్తలు చాలా అవసరమని.. ఆ విషయాన్ని మేకపాటి మిస్ అయినట్లుగా చెప్పక తప్పదు.

ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే సీఎంవో అని కేసీఆర్ అంటేనే జనాలకు నచ్చనిది.. ఇప్పుడు ఏకంగా సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అనటం ఏ మాత్రం సరికాదంటున్నారు. ఇప్పటికే ఏపీకి రాజధాని లేకుండా చేశారన్న విమర్శను ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి.. తాజాగా మేకపాటి చేసిన వ్యాఖ్యలు మరింత డ్యామేజ్ చేస్తాయన్న మాట వినిపిస్తోంది. ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలీకపోతే ఎలా మంత్రిగారు అంటూ సొంత పార్టీ నేతలు కొందరు చెవులు కొరుక్కోవటం గమనార్హం.