Begin typing your search above and press return to search.

మంత్రి కొడాలి నాని బీజేపీ, టీడీపీ, పవన్ పై ఫైర్

By:  Tupaki Desk   |   9 Nov 2021 11:30 AM GMT
మంత్రి కొడాలి నాని బీజేపీ, టీడీపీ, పవన్ పై ఫైర్
X
ఏపీ ఫైర్ బ్రాండ్ మంత్రి కొడాలి నాని మరోసారి రెచ్చిపోయారు. తన నోటికి పనిచెబుతూ తిట్ల దండకం చేశారు. బీజేపీ, టీడీపీ నేతలపై ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ, టీడీపీ నేతలు చేస్తున్న విమర్శల నేపథ్యంలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

స్టీల్ ప్లాంట్ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న కామెంట్స్ పైనా మంత్రి నాని తీవ్రంగా స్పందించారు. పవన్ కు దమ్ముంటే.. స్టీల్ ప్లాంట్ పై ప్రధాని మోడీకి అల్టిమేటం ఇవ్వాలని సవాల్ విసిరారు. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఎన్ని కుట్రలు చేసినా ఫలితం శూన్యం అని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేది కేంద్రం అని.. ఈ విషయంలో జగన్ పై కాకుండా కేంద్రంపై పోరాటం సాగించాలన్నారు.

పెట్రోల్, డీజిల్ ధరల గురించి మాట్లాడే బీజేపీ నేతలు.. ముందుగా కేంద్రం పెంచిన ధరలపై స్పందించాలన్నారు. ఏడాది కాలంలోనే కేంద్రం పెట్రోల్ పై 40 రూపాయలు పెంచిందన్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ చిత్తుచిత్తుగా ఓడిందని.. ఆ భయంతోనే ప్రజలను మభ్య పెట్టి రూ.5లు తగ్గించిందన్నారు. కొండంత పెంచి.. గోరంత తగ్గించి తామేదో ఘనకార్యం చేసినట్లు బీజేపీ నేతలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని కొడాలి నాని విమర్శించారు. రూ.70 ఉన్న పెట్రోల్ ను రూ.110కు ఎందుకు పెంచారని మంత్రి నాని ప్రశ్నించారు. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధర తగ్గినా.. దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నారని విమర్శలు గుప్పించారు.

బీజేపీ నేతలు పేదల రక్తం పీలుస్తున్నారని కొడాలి నాని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధర తగ్గినా.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నారని విమర్శలు గుప్పించారు.