Begin typing your search above and press return to search.

రేవంత్ ఇలాకాలో...టీఆర్ ఎస్ ర‌చ్చ‌

By:  Tupaki Desk   |   5 Aug 2018 6:43 AM GMT
రేవంత్ ఇలాకాలో...టీఆర్ ఎస్ ర‌చ్చ‌
X
ఫైర్‌ బ్రాండ్ - కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇలాకా అయిన కొడంగ‌ల్ మండ‌లంలోని కోస్గి ఉద్రిక్తంగా మారింది. ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు..ఏకంగా ముగ్గురు మంత్రులు - ఓ ఎంపీ పర్యటనతో ఇక్క‌డ పాలిటిక్స్ హీటెక్కాయి. కోస్గి మండల కేంద్రంలో 4 కోట్ల రూపాయలతో బస్టాండ్‌ ఆధునికీకరణ - సీఐ కార్యాలయ నిర్మాణ పనులకు మంత్రులు హరీశ్‌ రావు - నాయిని నర్సింహారెడ్డి - మహేందర్‌ రెడ్డి శనివారం శంకు స్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడేందుకు వెళ్తుండగా కాంగ్రెస్‌ నాయకులు - రేవంత్‌ రెడ్డి అనుచరులు బల ప్రదర్శనకు దిగారు. మహబూబ్‌ నగర్‌ - తాండూరు ప్రధాన రహదారిపై కాంగ్రెస్‌ నాయకులు పార్టీ జెండా లతో ర్యాలీ చేపట్టారు. దీంతో టీఆర్ ఎస్‌ నాయకులు కల్పించుకుని తోపు లాడుకున్నారు. పోలీసులు లాఠీచార్జి చేసి ఇరువురిని చెద రగొట్టారు. బహిరంగ సభలో నాయిని మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేది లేదు.. ఉత్తమ్‌ గడ్డం తీసేది లేదని ఎద్దేవా చేశారు.

కొడంగల్‌ లో మంత్రుల పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి ఓవర్‌ యాక్షన్ చేశార‌ని టీఆర్ ఎస్ వ‌ర్గాలు ఆరోపిస్తున్నాయి. నియోజకవర్గానికి ముగ్గురు మంత్రులు రావడంతో జంకిన రేవంత్‌ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలీసుల నుంచి అనుమతి తీసుకోకుండానే ర్యాలీ నిర్వహించడంతో పాటు మంత్రులను అడ్డుకునేందుకు ప్రయత్నించారని విమ‌ర్శిస్తున్నారు. ఫైర్‌ స్టేషన్ ప్రారంభవేదిక వద్దకు మంత్రులు రాకముందే ర్యాలీగా చేరుకొని బలనిరూపణ చేద్దామనుకున్న రేవంత్‌ కు అప్పటికే భారీగా చేరుకున్న టీఆర్ ఎస్ నేతలు.. రేవంత్ అనుచరులకు గట్టిగా బదులిచ్చారు. రేవంత్, ఆయన అనుచరులను నియంత్రించడంలో పోలీసులు ముందస్తుజాగ్రత్తలు తీసుకోకపోవడం పట్ల మంత్రులు అసహనం వ్యక్తంచేశారు.

కాగా, కొడంగల్ ప్రజలను టీడీపీ కాంగ్రెస్ నాయకులు మోసం చేశారని.. ఎన్నికల్లో గెలుపొందే వరకే ప్రజలను వాడుకొన్నారని మంత్రి హ‌రీశ్ రావు ఆరోపించారు. కొడంగల్ ప్రజలను మోసం చేసిన ద్రోహులకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కొడంగల్‌ లో టీఆర్ ఎస్ జెండా ఎగురడం ఖాయమని హరీశ్‌ రావు స్పష్టంచేశారు. ప్రతిపక్షాల పార్టీలకు జెండాలు పట్టే కార్యకర్తలే కరువయ్యారని ఎద్దేవాచేశారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ - హరీశ్‌ రావు ఎక్కడుంటే అక్కడ విజయముంటుందని - కొడంగల్‌ లో గులాబీజెండా ఎగరడం ఖాయమన్నారు. మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ - మీడియా పులిగా హైదరాబాద్‌ కు పరిమితమైన రేవంత్‌ రెడ్డి.. కొడంగల్ అభివృద్ధి నిరోధకుడిగా మారారని దుయ్యబట్టారు.