Begin typing your search above and press return to search.

పాపం... బుగ్గన...?

By:  Tupaki Desk   |   11 Nov 2021 6:30 AM GMT
పాపం... బుగ్గన...?
X
అధికారంతముల అయ్యవారి వైభోగాలు చూడమంటూ ఒక పద్యం ఉంది. అంటే అధికారం పోయాక నేతాశ్రీల పరిస్థితి అతి దారుణం అని ఆ పద్యం సారాంశం. మరి అధికారంలో ఉండి కూడా అష్టకష్టాలు పడే నేతల గురించి ఏ పద్యం రాయాలి. వారి బాధను ఏ మహా కవి వివరించాలి. నిజమే శ్రీమాన్ ఆర్ధిక మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి గారి బాధ పగవాడికి కూడా వద్దు బాబూ అని సొంత పార్టీలోనే జాలి పడుతున్నారు అంటే ఆయన ఇబ్బందులు ఎలాంటివిలో అర్ధం చేసుకోవాల్సిందే. ఆయన ఘనమైన శాఖకు మంత్రి. అది ఆర్ధిక శాఖ. అంటే డబ్బులు ఇచ్చే శాఖ. ఏ మంత్రి అయినా ఎంతటి కీలకమైన శాఖకు బాధ్యత వహించినా కూడా ఆర్ధిక మంత్రి ముందు తన సిఫార్సులు పంపించుకోవాలిసిందే. ఆయన కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఎదురుచూడాల్సిందే.

పూర్వకాలంలో అంటే చాలా దశాబ్దాల క్రితం ఆర్ధిక మంత్రికి ముఖ్యమంత్రితో పాటు సమానమైన విలువ ఉండేది. క్యాబినేట్ లో ఆయనే నంబర్ టూ గా ఉండేవారు. ఎవరు సీఎం అయినా ఆర్ధిక మంత్రి ఎవరూ అన్న ఆసక్తి కనిపించేది. అంటే ఆ శాఖలో ఎవరుంటే వారు పవర్ ఫుల్ అన్న మాట. ఎపుడైతే సంక్షేమ పధకాలు, దాని చుట్టూ ఓట్ల రాజకీయాలు అల్లుకువచ్చాయో అపుడే ఆర్ధిక మంత్రికి నానా సవాళ్ళూ వచ్చిపడ్డాయి. హామీలు ఇవ్వడం సులువు. తీర్చుకోవడం బహు కష్టం. ఎన్టీయార్ జమానాలో చౌక రోజులు కాబట్టి రెండు రూపాయలకు కిలో బియ్యం అన్నా యాభై రూపాయలకే చీరా ధోవతీ ఇచ్చినా కుదిరేది. ఆయన వద్ద ఆర్ధిక మంత్రులుగా సీనియర్ నేత మహేంద్ర నాధ్ నుంచి చంద్రబాబు దాకా చేశారు. ఎవరికీ ఇబ్బందులు అయితే ఎదురుకాలేదు. చంద్రబాబు జమానాలో యనమల రామక్రిష్ణుడు, అశోక్ గజపతిరాజు చేసినా యనమల ఘటికుడు అనిపించుకున్నారు.

ఇక వైఎస్సార్ తో పాటు కాంగ్రెస్ లో అందరి ముఖ్యమంత్రుల వద్ద కొణిజేటి రోశయ్య ఆర్ధిక మంత్రిగా సరిగ్గా కుదిరిపోయారు. ఆయన లెక్కల్లో బహు దిట్ట కాబట్టి చిట్టా పద్దులు అన్నీ కూడా కరెక్ట్ గా చూసి మరీ ఆ శాఖను నిభాయించేవారు. అలాంటి రోశయ్యను సైతం వైఎస్సార్ తన హామీలతో చికాకు పెట్టేసేవారని పేరు. అయితే ఉమ్మడి ఏపీ, ఆదాయం బాగానే ఉండడంతో ఎలాగోలా నెట్టుకొచ్చారు. ఇక విభజన ఏపీలో చంద్రబాబు యనమల టీమ్ ఇబ్బందులు పడినా మరీ ఇంత దారుణంగా పరిస్థితి లేదు.

ఇపుడు చూస్తే ఆర్ధిక మంత్రి బుగ్గనను పట్టుకుని అంతా అప్పుల మంత్రి అంటూ సెటైర్లు వేస్తున్నారు అంటే బాధ కాక మరేంటి. అయన ప్రతీ వారం ఢిల్లీకి వెళ్తారు, అప్పుల కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రిని కలుస్తున్నారు. తమకు రుణ పరిమితి పెంచాలని కోరుతున్నారు. ఇన్ని చేసినా ఎలాగోలా అప్పులు పుట్టినా ఏపీకి ఉన్న ఆర్ధిక భారాల ముందు అవి ఏ మూలకూ చాలడంలేదు. ఉద్యోగుల జీతలు, పెన్షన్లకే నెలకు పదివేల కోట్లు కావాలి. ఇక సంక్షేమ పధకాలు అదనం. మొత్తానికి చూసుకుంటే ఆదాయ వనరులు పెద్దగా లేని ఏపీకి ఆర్ధిక మంత్రిగా ఉన్న బుగ్గన అప్పులు చేయడంలోనే నిపుణత సాధించారు అంటున్నారు విపక్ష నేతలు. బుగ్గన పరిస్థితి చూస్తే ఆ శాఖ మాకు వద్దు అనేస్తున్నారు ఇతర మంత్రులు. సో జగన్ మంత్రి వర్గ విస్తరణ చేసినా ఎవరి శాఖలు మార్చినా బుగ్గన సీటు మాత్రం పదిలమే. ఎందుకంటే ఆయన పడుతున్న కష్టాలు ఎవరూ కోరుకోరు కాబట్టి.