Begin typing your search above and press return to search.

రావణుడు ఢిల్లీలోనే ఉన్నాడన్న మంత్రి

By:  Tupaki Desk   |   6 Feb 2017 8:38 AM GMT
రావణుడు ఢిల్లీలోనే ఉన్నాడన్న మంత్రి
X
ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మొన్నటికి మొన్న స్కామ్ (SCAM) కు సరికొత్త అర్థాన్ని చెప్పేలా మోడీ రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడితే.. దానికి కౌంటర్ గా విపక్షాలు మోడీపై విరుచుకుపడటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా యూపీ అధికారపక్షానికి చెందిన మంత్రి.. వివాదాస్పద నేత ఆజంఖాన్ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని మోడీ పేరును నేరుగా ప్రస్తావించని ఆయన.. యూపీ ఎన్నికల సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 130 కోట్ల మంది భారతీయుల్ని పాలిస్తున్న రాజు రావణుడి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు లక్నో వెళ్లారని.. కానీ.. ఆయన మర్చిపోయిన విషయం ఏమిటంటే.. రావణుడు లక్నోలో లేడు.. ఢిల్లీలోనే ఉన్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సంపన్నుల ప్రయోజనాల్ని పరిరక్షించేందుకు ప్రధాని పని చేస్తున్నారని.. యూపీ అభివృద్ధి కావాలంటే సమాజ్ వాదీ పార్టీకే ఓటు వేయాలని ఆయన కోరారు. యూపీ ఎన్నికల్లో పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ నేతల మధ్య వ్యాఖ్యల తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నాయి. మరో ఐదు రోజుల్లో (ఫిబ్రవరి 11న) తొలి దశ పోలింగ్ జరగనుంది. అప్పటి నుంచి ప్రతి నాలుగైదురోజులకో దశ పోలింగ్ జరగనుంది. మొత్తం ఏడు దశల్లో యూపీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ తేదీలు దగ్గరకొస్తున్న కొద్దీ.. నేతల మాటలు తూటాల్లా వారి ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. మరి.. మోడీని రావణుడితో పోలుస్తూ మంత్రి ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యలకు కమలనాథులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/