Begin typing your search above and press return to search.

తెలంగాణ బరిలోకి కాంగ్రెస్‌ అగ్రనేతలు?!

By:  Tupaki Desk   |   8 July 2015 2:30 PM GMT
తెలంగాణ బరిలోకి కాంగ్రెస్‌ అగ్రనేతలు?!
X
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల బరిలోకి ఇక కాంగ్రెస్‌ అగ్ర నేతలు అంతా దిగాలని భావిస్తున్నారట. ఇక్కడి కాంగ్రెస్‌ నాయకులు తమ ప్రభావాన్ని, ప్రతాపాన్ని చూపలేకపోతున్నారు కనక ఢిల్లీ నుంచి ఇక్కడికి తీసుకు రావాలని అనుకుంటున్నారట. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వారందరినీ ఇక్కడి ఎంపీ సీట్లలో నిలబెట్టాలని భావిస్తున్నారట.

పార్లమెంటు తలుపులు మూసి, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని తుంగలోకి తొక్కి అడ్డగోలుగా రాష్ట్ర విభజన తీర్మానానికి ఆమోదం తెలిపేలా చేసి అప్పటి లోక్‌సభ స్పీకర్‌ మీరా కుమార్‌ను వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికల బరిలోకి దింపాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం భావిస్తోందట. అక్కడ ఆమె విజయం సాధిస్తే 2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ అగ్ర నాయకులంతా తెలంగాణ పోటీ చేయడానికి సిద్ధమవుతారేమోనని ఇక్కడి కాంగ్రెస్‌ నాయకులు ఆందోళన చెందుతున్నారు.

తెలంగాణ ఇచ్చింది నేనే అంటూ సోనియా గాంధీ మెదక్‌ బరిలో దిగవచ్చని.. రాహుల్‌ గాంధీ మహబూబ్‌నగర్‌ బరిలో దిగవచ్చని.. జైరాం రమేశ్‌.. సుశీల్‌ కుమార్‌ షిండే.. చిదంబరం.. ఇటువంటి వాళ్లంతా తెలంగాణలో ఒక్కో ఎంపీ సీటును పంచేసుకోవచ్చని టీ కాంగ్రెస్‌ నేతలు ఆందోళన చెందుతున్నారు. అప్పుడు పోటీ చేయడానికి తమకు ఒక్క సీటు కూడా మిగలదని కూడా ఆందోళన చెందుతున్నారు. పెద్దమ్మని అంటూ సోనియా వస్తే చిన్నమ్మనంటూ సుష్మా స్వరాజ్‌ కూడా వస్తుందేమోనని బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. హతవిధీ..!