Begin typing your search above and press return to search.

పవర్ గ్రిడ్ నిర్మాణంలో మేఘాకు రికార్డు

By:  Tupaki Desk   |   28 March 2018 5:21 AM GMT
పవర్ గ్రిడ్ నిర్మాణంలో మేఘాకు రికార్డు
X
జాతీయ స్థాయిలో అరుదైన ఘనతను మేఘా (మేఘ ఇంజనీరింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్) దక్కించుకుంది. తొలిసారిగా నిర్దేశించిన గడువుకన్నా ముందే సబ్స్టేషన్ను నిర్మించిడం ద్వారా ఆ రికార్డ్ను సొంతం చేసుకుంది. జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన - నవరత్నాల్లో ఒకటైన పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ) నుంచి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కదిరి సమీపంలోని ఎన్పీ కుంట (నంబులపూలకుంట) వద్ద సబ్ స్టేషన్ నిర్మాణాన్ని టెండర్ ద్వారా దక్కించుకుని ముందుగానే పూర్తి చేసినందుకు పవర్ గ్రిడ్ తాజాగా మెమొంటోతో పాటు ప్రశంస పత్రంతో మేఘాను అభినందించింది. గడువుకన్నా ముందే ప్రాజెక్ట్ పూర్తి చేయటం జాతీయ స్థాయిలో అరుదైన విషయంగా నమోదైంది. అందులో భాగంగానే పవర్ గ్రిడ్ నుంచి ఉత్కృష్టత పురస్కార్ మెమొంటోను అందుకుంది. పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) ఎన్పీకుంట వద్ద కేవలం 7 నెలల కాలంలోనే 400/220 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణాన్ని పూర్తిచేసి దేశంలోనే అత్యంత వేగంగా ఈ ప్రాజెక్ట్ ని నిర్మించిన ఘనత మేఘా ఇంజనీరింగ్దే. దేశంలోనే ఇదొక రికార్డ్. ఈ విషయాన్ని పీజీసీఐఎల్ తన పత్రికా ప్రకటనలో అధికారంగా తెలియజేసింది. అలాగే పీజీసీఐఎల్ అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘బెస్ట్ డెబ్యుటెంట్ అవార్డు’ను మేఘా ఇంజనీరింగ్ (ఎంఈఐఎల్) దక్కించుకుంది. అనంతపురం జిల్లాలోని ఎన్పీకుంట వద్ద ఏర్పాటు చేస్తున్న ఆల్ట్రా మెగా సోలార్ పార్క్ ను పవర్ గ్రిడ్ కు అనుసంధానించడం కోసం చేపట్టిన ఈ సబ్స్టేషన్ 12 నెలల వ్యవధిలో పూర్తిచేయాల్సి ఉండగా ఐదు నెలల ముందుగానే అంటే 7 నెలల సమయంలో నిర్మాణాన్ని పూర్తి చేసి నాణ్యతా ప్రమాణాల ప్రకారం పనితీరు సంతృప్తికరంగా ఉన్నట్లు పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ధృవీకరించింది. ఈ మేరకు పవర్ గ్రిడ్ తన వెబ్ సైట్లో ఈ అంశాన్ని ప్రత్యేకంగా పేర్కొనడంతోపాటు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి తన అధికారిక ఫేస్ బుక్ ఖాతాలో కూడా పవర్ గ్రిడ్ ను అభినందిస్తూ పోస్ట్ చేశారు. డిజైన్ - ఇంజనీరింగ్ తయారీ - టెస్టింగ్ మొదలైన పనులతోపాటు నిర్మాణ పనిని పూర్తి చేయటానికి సాధరణంగా 15 నుంచి 18 నెలల సమయం పడుతుంది. అంటే దాదాపు మూడవవంతు సమయానికే నిర్మాణ పనిని మేఘా పూర్తి చేసింది.

ఎన్పీకుంట వద్ద కొత్తగా నిర్మించిన ఆల్ట్రా మెగా సోలార్ పవర్ పార్క్ నుంచి 1500 మెగావాట్ల విద్యుత్ ను సరఫరా చేసేందుకు ఉద్దేశించిన ఈ 400/220 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణాన్ని ఎంఈఐఎల్ చేపట్టింది. ఆ ప్రాంతంలో విద్యుత్ అవసరాలను - ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని ఎంఈఐఎల్ వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు సమాయత్తమైంది. 25 సెప్టెంబర్ 2015న ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూమిని ఎంఈఐఎల్ కు పీజీసీఐఎల్ అప్పగించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఎంఈఐఎల్ 500ఎంవీఏ - 400/220 కేవీ సామర్థ్యం కలిగిన మూడు ఆటో ట్రాన్స్ ఫార్మర్లు - 125 ఎంవీఏఆర్ ఒక బస్ రియార్టర్ను నిర్మించింది. 400 కేవీ 100 ఎవీఏఆర్ స్టేషన్ ఒకటి. 400 కేవీ బేస్ లైన్లు రెండు - 400 కేవీ టైబేస్ లు నాలుగు - 220 కేవీ లైన్ బేస్లు నాలుగు - 220 కేవీ బస్ కప్లార్ బే ఒకటి - 220 కేవీ ట్రాన్స్ ఫార్మర్ బస్ కప్లార్ బే ఒకటి - 220కేవీ - 500 ఏంవీఏ - ఆటోట్రాన్స్ ఫార్మర్ బేు మూడు ఏర్పాటు చేసింది. వీటితో పాటు డ్రైన్లు - రహదారాలు - కల్వర్టులు - కంట్రోల్ రూమ్ - బే క్యూస్క్ - ట్రాన్సిట్ క్యాంపు - ఫైర్ ఫైటింగ్ పంప్ హౌస్ మొదలగు నిర్మాణాలను పూర్తి చేసింది.

పీజీసీఐఎల్ క్లిష్టమైన నమూనాలు - కఠినమైన నిబంధనలు - ఏమాత్రం అనుకూల పరిస్థితులు లేని ఈ ప్రాంతంలో ప్రాజెక్టును చేపట్టిని ఎంఈఐఎల్ అత్యంత వేగంగా పనులను పూర్తి చేసింది. సబ్ స్టేషన్ నిర్మాణ ప్రాంతంలో అత్యంత క్లిష్టమైన రాతి పొరలను తొలగించేందుకు పేలుళ్లు జరపాల్సి వచ్చింది. అలాగే ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే అంటే 2015-16లో ఈ ప్రాంతంలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురిశాయి. ఇలాంటి ఎన్నో అవాంతరాలను అధిగమించి ఎంఈఐఎల్ గడువులోగా అంటే కేవలం ఏడు నెలల కాలంలోనే ప్రాజెక్టును పూర్తిచేసి పీజీసీఐఎల్ కు అప్పగించింది. 25 ఏప్రిల్ 2016న ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరిగింది. అత్యంత వేగంగా పూర్తయిన ఎన్పీ కుంట ప్రాజెక్టు గత రెండేళ్లుగా ఎటువంటి సాంకేతిక అవాంతరాలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేస్తున్నది.

2016-17 ఆర్థిక సంవత్సరంలో దేశ వ్యాప్తంగా ఐదు ప్రధాన సబ్ స్టేషన్లను పవర్ గ్రిడ్ ప్రారంభించగా అందులో ఎన్పి కుంట సబ్ స్టేషన్ ను ఏపిలోని కడప - కర్నాటకలోని కోలార్ ట్రాన్స్ మిషన్ లైన్లో భాగంగా నిర్దేశించిన గడువుకన్నా ముందే ప్రారంభించడానికి మేఘా ఇంజనీరింగ్ యుద్ధప్రతిపాదికన నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయటమే కారణం.

పక్కా ప్రణాళికను రూపొందించుకోవడం - సాంకేతిక నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించడం - ఏకకాలంలో భిన్నమైన పనులను శరవేగంగా చేయడంతో పాటు ఎన్పీ కుంట సోలార్ పార్క్ వద్ద నిర్మించిన 400/220 కేవీ సబ్ స్టేషన్ ను కేవలం ఏడు నెలల రికార్డు సమయంలో ఎంఈఐఎల్ పూర్తిచేసింది. ఇది పునరుత్పాదక విద్యుత్ శక్తిని గ్రిడ్ కు అనుసంధానించడంలో శక్తివంతమైన ముందడుగు అని పీజీసీఐఎల్ తన వెబ్ సైట్లో పేర్కొంది.