Begin typing your search above and press return to search.

బాబును వాయించేసిన మేధావి

By:  Tupaki Desk   |   9 April 2017 4:10 AM GMT
బాబును వాయించేసిన మేధావి
X
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం గురించి ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు గొప్ప‌లు చెప్తుంటే...దేశంలోని ప‌లువురు నిపుణులు మాత్రం పెద‌వి విరుచుస్తున్నారు. ఇప్ప‌టికే జాతీయ స్థాయిలో త‌మ అభిప్రాయాలు వినిపించిన స‌ద‌రు ప్ర‌ముఖులు తాజాగా క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించ‌డం ద్వారా అమ‌రావ‌తి ప్రాంత రైతుల ఆవేద‌న‌ను తెలుసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఏపీ స‌ర్కారు అవ‌లంబించిన విధానాల‌ను తూర్పార ప‌డుతున్నారు. ప్రముఖ పర్యావరణవేత్త మేథాపాట్కర్ తాజాగా ఇదే రీతిలో చంద్ర‌బాబు స‌ర్కారు తీరును ఘాటుగా విమ‌ర్శించారు.

అమ‌రావ‌తి ప‌రిధిలోని అసైన్డ్ భూముల అంశం వివాదాస్ప‌దంగా మారిన నేప‌థ్యంలో తాజాగా అక్క‌డ మేథాపాట్క‌ర్ ప‌ర్య‌టించారు. అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టంలో మార్పులు చేయడం అప్రజాస్వామికమన్నారు. ఏపీ రాజధానిలో అసైన్డ్‌ భూములు ప్రభుత్వ భూములేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త నిర్వచనం చెబుతున్నారని మేథా పాట్క‌ర్ విమర్శించారు. అమ‌రావ‌తి ప్ర‌జా రాజ‌ధాని అని చెప్తున్న ప్ర‌భుత్వం ఇక్క‌డ ప్ర‌జ‌లు లేకుండా చేసే చ‌ట్టాల‌కు బాట‌లు వేస్తోంద‌ని మండిప‌డ్డారు. రైతులు, రైతు కూలీలు, ప్రజాసంఘాల ఉద్యమాలతో 2013 భూసేకరణ చట్టం ఏర్పడిందని మేథా పాట్క‌ర్ వివ‌రించారు. భూమి బంగారంతో సమానమని, అలాంటి బంగారం లాంటి భూములను ఏపీ సీఎం చంద్రబాబు లాక్కుంటున్నారని విమర్శించారు. మూడు పంటలు పండే భూములను ధ్వంసం చేస్తూ ఆహార భద్రతకు ముప్పు కలిగిస్తున్నారని మేథాపాట్కర్ అన్నారు.

ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో చంద్రబాబు దోపిడీకి పాల్పడుతున్నారని మేథా పాట్క‌ర్ ధ్వజమెత్తారు. అసైన్డ్ భూముల విష‌యంలో ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ప‌క్షాన ఆలోచించి స‌రైన నిర్ణ‌యం తీసుకోవాల‌ని పాట్క‌ర్ కోరారు. లేదంటే ప్ర‌జ‌ల నుంచి ఉద్య‌మం రావ‌డం ఖాయ‌మ‌ని ఆమె హెచ్చ‌రించారు. అభివృద్ధి ఎవ‌రూ కాద‌న‌ర‌ని అయితే ప్ర‌జ‌ల‌కు మేల చేసే కోణంలోనే సద‌రు ముంద‌డుగు ఉండాల‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/