Begin typing your search above and press return to search.

ఈవీఎంల ట్యాపింగ్‌...ఈసీ దృష్టికి రీపోలింగ్‌

By:  Tupaki Desk   |   11 March 2017 10:11 AM GMT
ఈవీఎంల ట్యాపింగ్‌...ఈసీ దృష్టికి రీపోలింగ్‌
X
ఉత్తరప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి - స‌మాజ్ వాధీ పార్టీ అధినేత్రి మాయావతి సంచ‌ల‌న వ్యాఖ్యాలు చేశారు. యూపీలో ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయని ఆమె అన్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌ లో బీజేపీ విజయం సాధించడం ప్రజాస్వామ్యానికి ముప్పేనని మాయావతి అన్నారు. ఇది ఎల‌క్ర్టానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ మాయాజాలమని తమ ఓట్లన్నీ బీజేపీకి పడేలా ఈవీఎంలను తయారు చేశారని ఆరోపించారు. బీజేపీకి ధైర్యం ఉంటే బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు మరొకసారి నిర్వహించాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా బరిలో నిలుపని బీజేపీ మెజార్టీ చోట్ల‌ గెలవడం విచిత్రంగా ఉందని మాయావ‌తి వ్యాఖ్యానించారు. యూపీలో ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్‌ - ఫలితాల ప్రకటన నిలిపివేయాలని - పేపర్‌ బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలను తిరిగి నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి మాయావ‌తి లేఖ రాశారు.

మ‌రోవైపు ఉత్తరప్రదేశ్‌ కు చాలా కాలం తర్వాత మంచి రోజులు వచ్చాయని కేంద్రమంత్రి ఉమాభారతి పేర్కొన్నారు. బీజేపీ గెలుపుతో యూపీ అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతదని తెలిపారు. బీజేపీ గెలుస్తుంద‌నే నమ్మకం మూడేళ్ల క్రితం లేద‌ని తెలిపారు. కానీ యూపీలో బీజేపీ విజ‌యం ఖాయ‌మ‌నే భావ‌న ఆరు నెలల క్రితమే ఏర్పడిందన్నారు. గెలుపునకు కుల - మత రాజకీయాలు కారణం కాదన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ - ఎస్పీ అధినేత‌ అఖిలేష్ యాద‌వ్‌ గుర్తించలేకపోయారని తెలిపారు. ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించే విధంగా మోదీ ముందుకెళ్తున్నారని స్పష్టం చేశారు. కాగా, రామజన్మభూమి సమయంలో కూడా బీజేపీకి ఇన్ని సీట్లు రాలేదని మ‌రో కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. ఇది మోడీ విజయమని, నోట్ల రద్దుపై సాధించిన విజయమని ఆయన చెప్పారు. బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో విపక్షాలు చిత్తుచిత్తు అయిపోయాని అన్నారు. ఆ పార్టీలు రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలలో పోటీ చేయాలని భావించలేనంతగా ప్రజలు వాటికి గుణపాఠం చెప్పారని విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు.

ఇదిలాఉండ‌గా..లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్ పరాజయం పాలయ్యారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన రీటా బహుగుణ జోషీపై అపర్ణా యాదవ్ పరాజయం పాలయ్యారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/