Begin typing your search above and press return to search.

భారత్ లో రోజుకు 2.87లక్షల కేసులు...ఎప్పుడంటే

By:  Tupaki Desk   |   8 July 2020 5:56 PM GMT
భారత్ లో రోజుకు 2.87లక్షల కేసులు...ఎప్పుడంటే
X
మహమ్మారి వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడిన దేశాలు విలవిలలాడిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 1.12 కోట్లకు పైగా కేసులు నమోదు కాగా....ఈ ప్రాణాంతక వైరస్ 5 లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. ఇక, భారత్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఏడున్నర లక్షలు దాటింది. ప్రతి రోజు 20వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండడం కలవరపెడుతోంది. పాజిటివ్ కేసుల్లో . అమెరికా, బ్రెజిల్ తర్వాతి స్థానాల్లో భారత్ నిలవడంతో భారతీయులు ఆందోళన చెందుతున్నారు. అయితే, తాజాగా మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) వెల్లడించిన సర్వే వివరాలు భారతీయులను మరింత కలవరపాటుకు గురి చేసేలా ఉన్నాయి. 2021 ఫిబ్రవరిలో భారత్ లో రోజుకు 2.87 లక్షల కరోనా కేసులు నమోదవుతాయని ఎంఐటీ వెల్లడించింది. 84 దేశాలలో చేసిన సర్వే ప్రకారం ఎంఐటీ ఈ వివరాలు వెల్లడించింది.

అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహించిన అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2021 మార్చి వరకు ప్రపంచ వ్యాప్తంగా 25 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదవుతాయని ఎంఐటీ తెలిపింది. ఈ మహమ్మారి బారినపడి 18 లక్షలకు పైగా ప్రజలు ప్రాణాలను కోల్పోతారని వెల్లడించింది. భారత్ లోనూ అనూహ్యంగా కేసులు నమోదవుతాయని...వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రోజుకు 2.87 లక్షల వరకు పాజిటివ్ కేసులు వస్తాయని తేలింది. భారత్ తర్వాత అమెరికా(95వేలు) కరోనా వల్ల తీవ్రంగా నష్టపోతుందని తెలిపింది. కరోనాకు సరైన చికిత్సా విధానం కనుగొనకుంటే 2021 మార్చి-మే మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా 20 నుంచి 60 కోట్ల వరకు పాజిటివ్ కేసులు నమోదవుతాయని వెల్లడించింది.