Begin typing your search above and press return to search.

మార్కెట్లో ఆ కారు దుమ్ము రేపుతోందా?

By:  Tupaki Desk   |   11 March 2016 10:30 PM GMT
మార్కెట్లో ఆ కారు దుమ్ము రేపుతోందా?
X
నిమిషంలో ఇన్ని వేల ఫోన్లు అమ్మేశాం.. ఒక రోజులో తమ ఉత్పత్తులు ఎంత భారీగా అమ్ముడయ్యాయంటే... ఇలాంటి విషయాలను పలు వాణిజ్య సంస్థలు భారీగా ప్రచారం చేసుకోవటం మామూలే. ఈ కామర్స్ జోరుగా సాగుతున్న వేళ.. కొన్ని ఉత్పత్తులకు డిమాండ్ భారీగా ఉండటం కనిపిస్తుంది. అయితే.. అలాంటి వాటికి పూర్తి భిన్నమైంది కార్ల మార్కెట్.

ఒక కారును కొనాలంటే సవాలక్ష సంగతులు చూసుకుంటారు. కొత్త కార్ల విషయంలో తొందరపడి కొనటం లాంటివి చేయరు. కార్ల మార్కెట్ లో అనుభవం ఉన్న వారు సైతం చెప్పే మాటేమిటంటే.. ఏదైనా కొత్త మోడల్ ను కొనాలంటే కనీసం ఆర్నెల్లు.. లేదంటే ఒక ఏడాది ఆగి దాని పనితీరు.. ఫిర్యాదులు లాంటివి చూసుకున్న తర్వాతే కొనుగోలు చేయటం ఉత్తమంగా చెబుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో.. మార్కెట్ లోకి కొత్త కారు వచ్చిన వెంటనే.. మిగిలిన వస్తువుల మాదిరి ఎగబడి కొనే వారు చాలా తక్కువగా కనిపిస్తారు. కానీ.. తాజాగా మార్కెట్ లోకి విడుదలైన ఒక కారు బుకింగ్ ల విషయంలో దుమ్ము రేపటం ఆసక్తికరంగా మారింది. ప్రముఖ కార్ల కంపెనీ మారుతి.. తాజాగా విటారా బ్రెజ్జా పేరిట ఒక స్పోర్ట్స్ వినియోగ వాహనాన్ని (ఎస్ యూవీ) విడుదల చేసింది.

ఈ కారును విడుదల చేసిన 48 గంటల వ్యవధిలోనే ఏకంగా 5,600 మంది కారు కోసం బుకింగ్ చేసుకోవటం ఆసక్తికరంగా మారింది. మార్కెట్ లోకి వచ్చిన ఒక కొత్త కారు విషయంలో ఇంతటి సానుకూలత వ్యక్తం కావటం ఆసక్తికరమని చెబుతున్నారు. లీటరుకు 24.3 కిలోమీటర్ల మైలేజ్ గా చెబుతున్న ఈ కారు రూ.6.99లక్షల నుంచి రూ.9.68 లక్షల మధ్య లభించనుంది. ​