Begin typing your search above and press return to search.

వాళ్లు మాత్రమే నిజమైన భారతీయులట

By:  Tupaki Desk   |   12 Aug 2016 1:37 PM GMT
వాళ్లు మాత్రమే నిజమైన భారతీయులట
X
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి.. ప్రెస్ కౌన్సిల్ మాజీ ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ గురించి తెలిసిందే. ఆయనకు ఏం అనిపించినా ముందు వెనుకా చూడకుండా వ్యాఖ్యలు చేయటం ఆయనకు మాత్రమే సాధ్యమని చెప్పాలి. చాలా సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతుంటాయి. తాజాగా ఆయన సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టింగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

భారతదేశంలో అసలుసిసలు భారతీయులు కేరళ రాష్ట్రీయులు మాత్రమేనని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకలా అన్న విషయాన్ని ఆయన చెబుతూ.. సహనంగా వ్యవహరించటం.. ఒకరితో ఒకరు కలిసిమెలిసి సామరస్యంగా జీవించే గొప్ప భారతీయ గుణం కేరళ వాసుల్లో కనిపిస్తుందన్నారు. ఒకరి అభిప్రాయాల్ని మరొకరు గౌరవించుకోవటం.. వారి విశాల దృక్ఫధాన్ని మిగిలిన దేశమంతా అనుసరించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.

కట్జూ వ్యాఖ్యలపై కేరళ వాసులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.ఒక ప్రముఖుడి నోటి నుంచి వచ్చిన కాంప్లిమెంట్ వారిని సంతోషానికి గురి చేయటమే కాదు.. ఆయన పెట్టిన పోస్టుకు వేలాది లైకులు.. షేరింగ్ లు వస్తున్నాయి. ఇలా షేర్లు.. లైకులు ఇస్తున్న వారిలో అత్యధికులు కేరళీయులేనని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారి గురించి కట్జూ ప్రస్తావించకపోవటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేరళలో కనిపించింది ఈశాన్య రాష్ట్రాల్లో కట్జూకి ఎందుకు కనిపించలేదో..?