Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ బాధల్లా అదే: ఎంపీ భరత్ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   28 Sep 2021 10:30 AM GMT
పవన్ కళ్యాణ్ బాధల్లా అదే: ఎంపీ భరత్ సంచలన వ్యాఖ్యలు
X
ఆన్ లైన్ టికెట్ విధానాన్ని వ్యతిరేకిస్తున్న పవన్ కళ్యాణ్ బాధల్లా తనకు వచ్చే బ్లాక్ మనీ ఈ విధానంతో పోతుందనే అని రాజమండ్రి ఎంపీ భరత్ సంచలన ఆరోపణలు చేశారు. టాలీవుడ్ లో టాప్ హీరోలు నలుగురో ఐదుగురో ఉన్నారని.. వారి సినిమా విడుదల వేళ 100 రూపాయల టికెటన్ ను రూ.500 చేసి బ్లాక్ గా అమ్ముతారని.. ఆ రూ.400 సొమ్ము బ్లాక్ మార్కెట్ గా సొమ్ము చేసుకోని కోట్లకు పడగలెత్తుతారని ఎంపీ భరత్ విమర్శించారు.

అదే ఆన్ లైన్ విధానంతో అయితే రూ.100 రూపాయలు మాత్రమే వస్తే కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ లాంటి వారికి బ్లాక్ లో డబ్బులు రావని.. అందుకే ఆయన గొడవ చేస్తున్నాడని ఎంపీ భరత్ ఆరోపించారు. సినిమాకు 200 కోట్లు బడ్జెట్ తీసుకునే వీళ్లంతా ముందుగా కొన్ని డబ్బులు తీసుకొని సినిమాల్లో వచ్చిన లాభాలను షేర్ తీసుకుంటారని.. ఇప్పుడు రూ.100 టికెట్ చేస్తే వీరికి 50 కోట్లు, 100 కోట్లు రావని.. ప్రజలకు మాత్రం సరసమైన ధరలకు సినిమాలు చూస్తారని.. ప్రభుత్వానికి సరిగ్గా పన్నులు వస్తాయని భరత్ చెప్పుకొచ్చాడు.

ఇండస్ట్రీ అంతా కలిపితే 40 కోట్లు రావడం లేదంటున్నారని.. కానీ ఈ స్టార్ హీరోలు ఒక్కొక్కరూ 50 కోట్లు, 100 కోట్లు వసూళ్లు చేసేది ఈ బ్లాక్ టికెట్ల దందాతోనేనని ఎంపీ భరత్ విమర్శించాడు. దీన్ని బట్టి ఎంత డబ్బు బ్లాక్ మార్కెట్ కు పోతుంది.. ఎంత ప్రభుత్వానికి, ప్రజలకు నష్టం అని ఆలోచించాలని ఎంపీ భరత్ చెప్పుకొచ్చాడు.

సరిగ్గా రూ.100కు టికెట్ అమ్మితే రూ.4వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని.. ఇంతలా అందులో దోపిడీ జరుగుతోందని ఎంపీ భరత్ చెప్పుకొచ్చాడు. ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు, హీరోదాకా.. వీళ్లంతా పన్నుల రూపంలో ఎన్ని టికెట్లు ప్రభుత్వానికి చూపిస్తున్నారో కూడా తెలియడం లేదని.. దోపిడీ ఎక్కువగా ఉందని ఎంపీ భరత్ విమర్శించాడు.

పవన్ లాంటి హీరోలు ఒక్కొక్కరు 100 కోట్ల రెమ్యూనరేషన్లు తీసుకుంటుంటే.. మొత్తంగా నిర్మాతలకు 40 కోట్లు రావడం లేదంటే మిగతా సొమ్ము అంతా ఎటుపోతోందని ఎంపీ భరత్ ప్రశ్నించారు. మార్కెట్ అంతా గోదావరి జిల్లాల నుంచే ఉందని.. అక్కడ ఎంత టికెట్ రేట్లను చూపిస్తున్నారు? ఎంత ఎగ్గొడుతున్నారని నిలదీశారు.

ఆన్ లైన్ సిస్టం తీసుకురావడం వల్ల పారదర్శకత పెరుగుతుందని.. అందుకే ఈ విధానాన్ని జగన్ ప్రభుత్వం తీసుకొస్తందని ఎంపీ భరత్ తెలిపారు. ఆన్ లైన్ సిస్టంతో చిన్న సినిమాలు కూడా బతుకుతాయని అన్నారు. రూ.100 టికెట్ తో ప్రజలు కూడా ఎక్కువగా చూస్తారని.. న్యాయం జరుగుతుందని ఎంపీ భరత్ వివరించాడు.