Begin typing your search above and press return to search.

అర్థ‌రాత్రి వేళ‌.. మావోలు చెల‌రేగిపోయారు

By:  Tupaki Desk   |   27 Jan 2018 4:38 AM GMT
అర్థ‌రాత్రి వేళ‌.. మావోలు చెల‌రేగిపోయారు
X
గ‌డిచిన కొద్దికాలంగా కామ్ గా ఉన్న మావోలు చెల‌రేగిపోయారు. శుక్ర‌వారం రాత్రివేళ.. అనూహ్యంగా మెరుపుదాడికి పాల్ప‌డ్డారు. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం సంచ‌ల‌నంగా మారింది. తాజాగా అందుతున్న స‌మ‌చారం ప్రకారం.. రెండు వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

అమాయ‌కులైన ఇద్ద‌రు వ్య‌క్తుల్ని ఇన్ఫ్ ఫార్మ‌ర్ల‌న్న ఆరోప‌ణ‌ల మీద దాడి చేసి హ‌త‌మార్చిన‌ట్లుగా చెబుతున్నారు. త‌మ‌కు సంబంధించిన స‌మాచారాన్ని పోలీసుల‌కు అంద‌జేస్తున్నార‌న్న ఉద్దేశంతో దాడి చేసి హ‌త‌మార్చిన‌ట్లుగా తెలుస్తోంది. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా పిన‌పాక మండ‌లం.. భూప‌తిరావు పేట స‌మీపంలో ఈ దారుణం చోటు చేసుకున్న‌ట్లుగా చెబుతున్నారు.

త‌మ‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారిని హ‌త‌మార్చ‌టం ఒక ఎత్తు అయితే.. ఇసుక ర్యాంప్ పైనా మెరుపుదాడికి పాల్ప‌డిన‌ట్లు చెబుతున్నారు. ర్యాంప్ ద‌గ్గ‌ర ఉన్న మూడు ఇసుక లారీల్ని ద‌గ్థం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. లారీల‌తో పాటు ప‌లు ట్రాక్ట‌ర్లు.. ప్రొక్ల‌యిన్ల‌ను కూడా ధ్వంసం చేసిన‌ట్లుగా స‌మాచారం. మావోల మెరుపుదాడి నేప‌థ్యంలో ర్యాంప్ నిర్వాహ‌కులు ఘ‌ట‌నాస్థ‌లం నుంచి పారిపోయిన‌ట్లుగా చెబుతున్నారు.

ఈ ఉదంతం గురించి స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి వెళ్లారు. అయితే.. ఈ మెరుపుదాడికి పాల్ప‌డింది మావోలేనా? లేక‌.. మ‌రెవ‌రైనా ఉన్నారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. కొంత‌కాలంగా స్త‌బ్ధుగా ఉన్న మావోలు ఇంత భారీగా దాడికి పాల్ప‌డ‌గ‌ల‌రా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.