Begin typing your search above and press return to search.

బాబు క‌మిటీకి నో చెప్పిన ప్ర‌ముఖ సీఎం

By:  Tupaki Desk   |   30 Nov 2016 7:38 AM GMT
బాబు క‌మిటీకి నో చెప్పిన ప్ర‌ముఖ సీఎం
X
స‌మ‌కాలిన రాజ‌కీయాల్లో స‌చ్చిల సీఎంగా పేరున్న త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్ మ‌రో ఆస‌క్తిక‌ర నిర్ణ‌యం తీసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావంపై పరిశీలన జరపడానికి కేంద్ర ప్ర‌భుత్వం నియమించనున్న ముఖ్యమంత్రుల కమిటీలో చేరడానికి మాణిక్‌ సర్కార్‌ విముఖత వ్యక్తం చేశారు. తాను మొదటినుంచి నోట్ల రద్దును వ్యతిరేకిస్తూనే ఉన్నానని కనుక ఈ కమిటీలో చేరలేనని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీకి స్పష్టం చేశానని ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో సామాన్యులు అనేక మంది తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతున్నార‌ని మాణిక్ స‌ర్కార్ అన్నారు. అందుకే ఈ క‌మిటీలో భాగ‌స్వామ్యం పంచుకోద‌లుచుకోలేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఈ క‌మిటీకి సార‌థ్యం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇదిలాఉండ‌గా నగదు రహిత లావాదేవీలపై ఉండవల్లి లోని తన నివాసం నుంచి చంద్రబాబు సమీక్షించారు. వ్యాపారస్తులు ఏపీ పర్స్‌ ను సమర్థంగా వినియోగించుకోవచ్చని చంద్రబాబునాయుడు అన్నారు. ప్రభుత్వ చెల్లింపులన్నీ ఏపీ పర్స్‌ ద్వారా జరుగుతాయన్నారు. వీలైనంత త్వరగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సి ఉంద‌ని, తాత్కాలికంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. రూపే - మాస్టర్‌ - వీసా కార్డులు పాస్‌ యంత్రం ద్వారా లావాదేవీలు జరపాలని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. జీతాలు అవసరమైన మేర వాయిదాల పద్దతిలో తీసుకోవాలన్నారు. ఫోన్ల ద్వారా చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. ప్రస్తుతం ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా బ్యాంకర్లు తమ పనితీరు మరింత మెరుగుపర్చు కోవాలని సూచించినట్లు స్పష్టం చేశారు. ఏపని వాయిదా వేసుకోకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నామని చంద్రబాబునాయుడు అన్నారు.

బ్యాంకర్లు - బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు - వెలుగు సిబ్బంది - నరేగా సూపర్‌ వైజర్లు - ఫీల్డ్‌ అసిస్టెంట్లు సమ న్వయంగా పని చేస్తే ప్రస్తుత పరిస్థితి నుంచి వేగంగా గట్టెక్కే అవకాశాలుంటాయని చంద్రబాబు నాయుడు సూచించారు. ఇందు కోసం 5,500మంది బిజినెస్‌ కరస్పాండెంట్లు - 29వేల మంది రేషన్‌ డిపోల డీలర్లు కలసి పనిచేయాలన్నారు. తద్వారా బ్యాంకర్లపై ఒత్తిడి తగ్గుతోందని చంద్రబాబు చెప్పారు. డిసెంబర్‌ 1నుంచి రాష్ట్రంలో నగదు రహిత ఆర్దిక లావాదేవీలకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఇందుకు తగ్గట్లుగా ప్రజల్లో చైతన్యం పెంచాలన్నారు. అవసరాన్ని బట్టి పదవీ విరమణ చేసిన బ్యాంక్‌ ఉద్యోగుల సేవల్ని కూడా వినియోగించుకోవాలన్నారు. నగదులావాదేవీదార్లు, మొబైల్‌ ద్వారా లావాదేవీల దార్ల వివరాల్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేయాలని చంద్ర‌బాబు అన్నారు. రాష్ట్రంలో నగదు అతితక్కువగా అందుబాటులో ఉందన్నారు.పోస్‌ మిషన్లు కూడా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయన్నారు. అయినా సమిష్టి కృషి, పరస్పర సమన్వయంతో ముందుకెళ్ళాల్సిన అవసరముందని చెప్పారు. కాగా ముఖ్యమంత్రుల కమిటీ సమావేశంపై ఇంకా స్పష్టత రాలేదని చంద్ర‌బాబు తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/