Begin typing your search above and press return to search.

ఆమ్లెట్ తగాదా ప్రాణం పోయే వరకు వెళ్లిందే

By:  Tupaki Desk   |   8 Feb 2021 11:45 AM IST
ఆమ్లెట్ తగాదా ప్రాణం పోయే వరకు వెళ్లిందే
X
విషయం చిన్నదా? పెద్దదా? అన్నది వదిలేసి.. అదే పనిగా గొడవలకు దిగటం ఈ మధ్యన ఎక్కువైంది. తాజాగా అలాంటి తగాదా నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆమ్లెట్ కోసం జరిగిన పోట్లాట.. ప్రాణం పోయేలా చేసిన వైనం తాజాగా హైదరాబాద్ మహానగరంలోని ఉప్పల్ లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

లంగర్ హౌస్ కు చెందిన 35 ఏళ్ల వికాస్ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తుంటారు. పిర్జాదిగూడలో ఉన్న స్నేహితుడు బబ్లూతో కలిసి పార్టీ చేసుకునేందుకు ఉప్పల్ లోని మహంకాళి వైన్స్ కు వెళ్లడాడు. మద్యం సీసాలు తీసుకొని.. పర్మిట్ రూంలో మద్యం తాగేందుకు వెళ్లారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. ఇక్కడే అనుకోని గొడవ తెర మీదకు వచ్చింది.

మద్యం తాగుతూ ఆమ్లెట్ తినేందుకు ఆర్డర్ ఇవ్వటం.. అందుకు రూ.60 ఇవ్వాలని దుకాణదారు చెప్పటంతో గొడవ మొదలైంది. రూ.60 ఎందుకు ఇవ్వాలి? అంత ధర ఏమిటంటూమొదలైన గొడవ అంతకంతకూ పెరిగి పెద్దదైంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దుకాణ యజమాని తన సిబ్బందితో వికాస్.. బబ్లూ మీద దాడి చేశారు. ఈ ఉదంతంలో తీవ్రంగా గాయపడ్డ వికాస్ మరణించాడు. దీంతో.. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. రూ.60 ఆమ్లెట్ ఒక నిండు ప్రాణాన్ని తీయటం విస్మయానికి గురి చేసింది.