Begin typing your search above and press return to search.

మోడీ తట్టుకోలేనంత రేంజిలో మమత కౌంటర్

By:  Tupaki Desk   |   9 Sep 2022 1:42 AM GMT
మోడీ తట్టుకోలేనంత రేంజిలో మమత కౌంటర్
X
మోడీని దగ్గర నుంచి చూసిన వారి ఆయన అహంభావి అంటారు. అయితే ఆయనను మెచ్చిన వారు ఆత్మ విశ్వాసి అని సమర్ధిస్తారు. ఈ రెండు మాటలు ఎలా ఉన్నా ఎనిమిదేళ్ళుగా మోడీని గమనిస్తున్న దేశ ప్రజలు రాజకీయాల మీద అవగాహన ఉన్న వారు ఆయన పట్టుదల మనిషి అనుకుంటారు. ఇక రాజకీయాలలో ముల్లుని ముల్లుతో తీయాలని అంటారు. పక్కా పాలిటిక్స్ ని అమలు చేసే నేతగా మోడీని అంతా చూస్తారు. ఇక తన రాజకీయ ప్రత్యర్ధుల విషయంలో మోడీ మార్క్ గేమ్స్ చాలా చిత్రంగా క్లిష్టంగా ఉంటాయి.

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ కోటను కొట్టాలనుకుని దూకుడు చేసిన బీజేపీ చివరికి చతికిలపడింది. దాంతో బీజేపీకి ఆ కోరిక అలాగే ఉండిపోయింది. ఇక మమతా బెనర్జీ అంతకు ముందు కంటే కూడా ఎక్కువ సీట్లతో మూడవసారి ముఖ్యమంత్రి అయిపోయారు. పైగా ఆమె ఢిల్లీ పీఠాన్ని చాలెంజి చేస్తున్నారు. ఇక మమత తీరు చూసినా తనకు ఎదురులేదని అనుకుంటారు. ఆమెను అహంభావి అని బీజేపీ వారు విమర్శిస్తారు.

ఏది ఏమైనా తాను బెంగాల్ టైగర్ ని తనను ఢీ కొట్టే సత్తా మీకు లేదని ఎప్పటికపుడు కమలనాధులకు రిటార్టులు గట్టిగా ఇస్తూ మమత కాషాయ కూటమికి కషాయం తినిపిస్తూ ఉంటుంది. అలాంటి మమత అహాన్ని దెబ్బకొట్టే ప్రతీ అవకాశాన్ని బీజేపీ వదులుకోదు. ఇక బీజేపీ విషయంలో తన రూటే సెపరేట్ అంటూ యుద్ధాన్ని యుద్ధంగానే ఆడుతోంది మమత.

అటు బీజేపీ ఇటు మమతల మధ్య ఈ సమరం ఎపుడూ వేడిగా వెచ్చగానే ఉంటుంది. ఆ మధ్య ప్రధాని మోడీ తుపాన్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటన కోసం బెంగాల్ వస్తే ఆయన్ని కలవకుండానే మమత హ్యాండ్ ఇచ్చారు. ఇపుడు కూడా అలాంటిదే మరోటి చేశారు. ఢిల్లీలో రాజ్ పధ్ ని కర్తవ్య పధ్ గా పేరు మార్చి సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ కి చెందిన మమతను ఆహ్వానించారు. కానీ ఆమె తనదైన మార్కు చూపిస్తూ డుమ్మా కొట్టారు.

సుభాష్ చంద్రబోస్ ఆ రాష్ట్రానికి చెందిన వారు. దాంతో ప్రోటోకాల్ అనుకున్నారో లేక మర్యాదపూర్వకంగా భావించారో ఏమో కానీ మమతకు ఒక ఆహ్వానం అయితే పంపారు. కానీ అది సరైన పద్ధతిలో పంపలేదని మమత అలిగారు. ఆగ్రహించారు. ఒక జూనియర్ అధికారి స్థాయి వారి చేత తనకు ఆహ్వానం పంపుతారా అని బెంగార్ టైగర్ మమత కస్సుమన్నారు. పైగా తాను ముఖ్యమంత్రిని అయితే నరేంద్ర మోడీ ప్రధాని, అయితే ఎక్కువేంటి అన్నట్లుగా మాట్లాడారు.

ఇక జూనియర్ అధికారి పంపిన లేఖలో సాయత్రం ఏడు గంటలకు కార్యక్రమం అయితే ఆరు గంటలకల్లా అక్కడ తాను ఉండాలని అందులో ఉందని, తాను ఏమైనా వారికి సేవకురాలినా అని మమత ప్రశ్నించారు. ఇక కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఏమైనా ఎత్తులో ఉన్నారా ఆయనకు తీరిక లేదా అని ప్రశ్నించారు. తనను సరిగ్గా ఆహ్వానించలేదు కాబట్టే తాను తన రాష్ట్రంలోనే నేతాజీ విగ్రహానికి దండ వేసి నివాళి అర్పించాను అని ఆమె చెప్పుకున్నారు.

ఇక బెంగాల్ లో రోజుకో మంత్రి మీద సీబీఐ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని, ఇదంతా బీజేపీ రాజకీయ సయ్యాటగా ఆమె అంటున్నారు. మొత్తానికి మమత మండిపోతున్నారు. నేనేం తక్కువ తినలేదు, తగ్గేది లేదు కాస్కోండి అని బీజేపీ వారిని గట్టిగానే హెచ్చరిస్తున్నారు. మోడీ వర్సెస్ మమత రాజకీయ యుద్ధంలో ఎవరు విజేతలు అన్నది ఇపుడే చెప్పడం కష్టం. ఇద్దరూ ఇద్దరే అని అంతా అంటారు మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.