Begin typing your search above and press return to search.

కేంద్రంలో కేసీఆర్ చ‌క్రం.. ముహూర్తం ఫిక్స్ అయిందా? మంత్రి మ‌ల్లా రెడ్డి ఏమ‌న్నారంటే

By:  Tupaki Desk   |   28 May 2022 12:30 AM GMT
కేంద్రంలో కేసీఆర్ చ‌క్రం.. ముహూర్తం ఫిక్స్ అయిందా? మంత్రి మ‌ల్లా రెడ్డి ఏమ‌న్నారంటే
X
కేంద్రంలో చ‌క్రం తిప్పేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా? విజ‌య‌ద‌శ‌మిని పుర‌స్క‌రించుకుని ఆయ‌న కేంద్ర రాజ‌కీయాల్లో త‌న జోరును పెంచ‌నున్నారా? అంటే.. మంత్రి మ‌ల్లారెడ్డి ఔన‌నే అంటున్నారు. కేంద్ర‌ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించి కార్మికులను రోడ్డున పడేస్తోందని మల్లారెడ్డి ధ్వజమెత్తారు. మోడీ నేతృత్వంలో బీజేపీ పూర్తిగా అబద్ధాల పార్టీగా తయారైందని అన్నారు. రాష్ట్రానికి రూపాయి కూడా ఇవ్వని మోడీ.. కేసీఆర్పై ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.

దేశానికి కేసీఆర్ ప్రధాని కావాలని భద్రకాళీ అమ్మవారిని మొక్కుకున్నట్లు తెలిపారు. రాబోయే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వ మేనని.. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని విజయదశమి నాడు చక్రం తిప్పేందుకు కేసీఆర్ బయలుదేరతారని ఆయన చెప్పారు. దళితబంధు ఇతర సంక్షేమ కార్యక్రమాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని.. సన్యాసం పుచ్చుకుంటానని మల్లారెడ్డి సవాల్ చేశారు. అంటే.. కేసీఆర్ ద‌స‌రా నుంచి కేంద్ర రాజ‌కీయాల్లో కీల‌కం కానున్నార‌నే విష‌యం స్ప‌ష్ట‌మైంది.

రేవంత్ కొత్త బిచ్చ‌గాడు!

కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కొత్త బిచ్చగాడి తరహాలో వ్యవహరిస్తున్నారని.. గతంలో ఏమీ చేయని కాంగ్రెస్ ఇప్పుడు ఏదో చేస్తుందనుకుంటే.. ప్రజలు నమ్మరని మ‌ల్లారెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి చెందుతోందని.. గతంలో ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు వలస పోతే ఇప్పుడు ఇతర రాష్ట్రాలనుంచే ఇక్కడకు వలస వస్తున్నారని అన్నారు. కార్మికులు లేనిదే ప్రపంచమే లేదని.. వారి సంక్షేమ కోసం ముఖ్యమంత్రి అనేక చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.

కరోనా, అధికారుల నిర్లక్ష్యంతో చనిపోయిన భవన నిర్మాణ కార్మికులకు పరిహారం అందడంలో జాప్యం జరిగిందని.. నెలలోనే వారి కుటుంబసభ్యులకు డబ్బులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్‌, బీజేపీలు రెండు కార్మిక వ్యవస్థనే నాశనం చేసేవిధంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. లక్ష మోటార్ సైకిళ్లను కార్మికులకు ఉచితంగా అందించే విధంగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారన్నారు.

''బీజేపీ నుంచి దేశానికి విముక్తి కల్పించాలని భద్రకాళీని ప్రార్థించా. దేశాన్ని భారతీయ జనతా పార్టీ నాశనం చేస్తోంది. కేసీఆర్‌ను ప్రధాని చేయాలని భద్రకాళీ అమ్మను మొక్కా. దొంగలు దేశాన్ని దోచుకొని విదేశాల్లో జల్సాలు చేస్తున్నారు. దేశంలో మాత్రం పేదలపై పన్నుల భారం మోపుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదు. విజయదశమి తర్వాత దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ చక్రం తిప్పుతారు. సీఎం కేసీఆర్ దేశ్ కీ నేత. ప్రధాని కావాలి.'' అన్నారు.