Begin typing your search above and press return to search.

బాబు క‌ల‌ల‌కు మ‌ళ్లీ దెబ్బ‌కొట్టిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   1 Jun 2016 6:08 AM GMT
బాబు క‌ల‌ల‌కు మ‌ళ్లీ దెబ్బ‌కొట్టిన కేసీఆర్‌
X
తెలుగుదేశం జాతీయపార్టీగా నమోదు కావాలంటే కనీసం మూడు రాష్ట్రాల్లో ఎంపీలు ఉండాల్సి ఉంటుంది. ఆ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు చెబుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ - తెలంగాణ రాష్ట్రాల్లో ఎంపీలు ఉన్నారు. అండమాన్‌ నికోమార్‌ దీవుల్లో పార్టీ విస్తరణ కోసం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నాం. దీనికి యువనేత లోకేశ్‌ పట్టుదలతో పనిచేస్తున్నారు. అక్క‌డా గెలుస్తాం. తెలుగుదేశం జాతీయ పార్టీగా అవతరించడం ఖాయం-- ఇది తెలుగుదేశం నాయ‌కులు పార్టీ పండుగ మ‌హానాడు సాక్షిగా త‌మ పార్టీ జాతీయ పార్టీగా రూపొందేందుకు ఉన్న అవ‌కాశాలు - ల‌క్ష్యం గురించి ఇచ్చిన వివ‌ర‌ణ. కానీ ఈ సంబురానికి టీఆర్ ఎస్ అధినేత‌ - గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ దెబ్బ‌కొట్టారు. మల్కాజ్‌ గిరి పార్లమెంటు సభ్యులు సీహెచ్‌. మల్లారెడ్డి రూపంలో ఈ షాక్ అందించారు.

తిరుపతి మహానాడుకు ముందు నుంచి మ‌ల్లారెడ్డి అన్యమనస్కంగానే ఉంటున్నారు. పార్టీ కార్యకలపాల్లోనూ చురుగ్గా పాల్గొనడం లేదు. పార్టీ తెలంగాణ నేతలతో సమన్వయం తగ్గింది. అయితే రెండు రోజులుగా లోక్‌ సభ నియోజకవర్గ పరిధిలోని ప్రధాన నాయకులు - కార్యకర్తలతో పార్టీ మారే విషయమై ఆయ‌న అభిప్రాయ సేకరణ జరిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను హైదరాబాద్‌ లోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలవనున్నట్టు మల్లారెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. తాను టీఆర్‌ ఎస్‌ లో చేరుతున్నట్టు స్వయంగా ఆయన ప్రకటించారు. అయితే తెలంగాణలో ఉన్న ఒకే ఒక్క ఎంపీ ఇప్పుడు టీఆర్‌ ఎస్‌ లోకి జారుకుంటున్న నేపథ్యంలో టీడీపీకి జాతీయ‌హోదా కష్టమే. 2019లో జ‌రిగే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున మ‌రో ఎంపీ గెలిస్తే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్ర‌కారం అప్పుడు జాతీయ హోదా ద‌క్కుతుంది. ఇలా ప్ర‌త్య‌క్షంగా మ‌ల్లారెడ్డి - ప‌రోక్షంగా కేసీఆర్ చంద్ర‌బాబును దెబ్బ‌తీశార‌ని అంటున్నారు.