Begin typing your search above and press return to search.

ఫ్రీగా కరెంట్.. అమ్మి సొమ్ము చేసుకోండి..

By:  Tupaki Desk   |   29 Oct 2019 10:22 AM GMT
ఫ్రీగా కరెంట్.. అమ్మి సొమ్ము చేసుకోండి..
X
ఉమ్మడి ఏపీలో ఓ పదేళ్ల కింద కాంగ్రెస్ హయాంలో కరెంట్ కష్టాల గురించి అడిగితే కథలు కథలుగా చెబుతారు. పల్లెలకు ఉదయం 6 గంటలకు పోతే సాయంత్రం 6 గంటలకు కరెంట్ వచ్చేది. కరెంట్ కోసం వెయ్యికళ్లతో అందరూ ఎదురుచూసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. కరెంట్ దొరికింది. 24 గంటలూ గృహాలకు, వ్యవసాయానికి సరఫరా అవుతోంది. రాత్రిపూట కరెంట్ పెట్టడానికి వెళ్లే రైతులే కనిపించడం లేదు. ఇదీ మన కరెంట్ విజయం

అయితే కరెంట్ ప్రతీ నెల వాడుతూ వేల బిల్లులు కట్టడమే కాదు.. ఇప్పుడు కరెంట్ నే ఆదాయమార్గంగా మలిచి లక్షలు సంపాదిస్తున్నారు కొందరు వినియోగదారులు. ఒక్క కృష్ణా జిల్లాలోనే కరెంట్ ను అమ్మి ఏకంగా ప్రతీ సంవత్సరం 43 లక్షలను సంపాదిస్తున్నారు వినియోగదారులు.

‘సూర్యశక్తి’ పథకం కింద సోలార్ రూఫ్ టాప్ ను ఇళ్లపై భాగంలో అమర్చుకొని సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఎవరైతే వినియోగదారులు ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ యూనిట్లను ఏర్పాటు చేసుకుంటారో వారికి రాయితీ కూడా ఇస్తోంది. ఇప్పటికే 643 మంది కృష్ణా జిల్లాలో దరఖాస్తు చేసుకోగా.. 444 గృహాలకు ఈ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. వారు వాడుకోగా మిగిలిన విద్యుత్ ను ఏపీఎన్పీడీసీఎల్ కొనుగోలు చేస్తోంది. యూనిట్ కు 5.58 చొప్పున గ్రిడ్ కు ఈ వినియోగదారులు అమ్ముకుంటున్నారు.

కేవలం రూ.60వేలు వినియోగదారులకు ఖర్చయ్యే ఈ పథకానికి రూ.50వేలను ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. అంటే పదివేలకే ఈ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకొని ఏడాదికి విద్యుత్ అమ్మకం ద్వారా లక్షలు సంపాదిస్తున్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా వినియోగదారులు ఏకంగా రూ.43 లక్షలను ఆర్టిస్తుండడం విశేషం.